తాళ్లపూడి పున్నమి ప్రతినిధి, జూన్ 30: ప్రజలకు ఆపద సమయంలో ప్రభుత్వం అండగా నిలవాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) ద్వారా మంజూరైన ఆర్థిక సాయాన్ని కొవ్వూరు నియోజకవర్గ శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు కూటమి నాయకులతో కలిసి బైక్ ర్యాలీగా వెళ్లి లబ్ధిదారులకు స్వయంగా అందజేశారు.
తాళ్లపూడి మండలంలోని మలకపల్లి, అన్నదేవరపేట, బల్లిపాడు, పెద్దేవం, పోచవరం, ప్రక్కిలంక, తాడిపూడి, తాళ్లపూడి, తిరగడమెట్ట, వేగేశ్వరపురం గ్రామాలకు చెందిన మొత్తం 40 మంది లబ్ధిదారులకు రూ.15,53,021 విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే వారి నివాసాలకు వెళ్లి పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా లబ్ధిదారులు, వారి కుటుంబ సభ్యులతో ఎమ్మెల్యే ఆప్యాయంగా మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు అవసరమైన సమయంలో ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తోందని, అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు చేరేలా నిరంతరం కృషి చేస్తున్నామని ఆయన తెలిపారు.
సకాలంలో ఆర్థిక సహాయం అందేలా ప్రత్యేక చొరవ తీసుకుని తమ ఇంటి వద్దకే వచ్చి చెక్కులను అందజేయడం పట్ల లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావుకు వారు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.



