నెల్లూరు బారాషహీద్ దర్గా రొట్టెల పండుగ ఏర్పాట్లపై నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఓ నందన్ బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు.
నెల్లూరు: రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందిన నెల్లూరు బారాషహీద్ దర్గా రొట్టెల పండుగ నిర్వహణను ప్రణాళికాబద్ధంగా చేపట్టాలని, నగర పాలక సంస్థ వివిధ విభాగాల అధికారులను కమిషనర్ వై.ఓ నందన్ సూచించారు. రొట్టెల పండుగ నిర్వహణపై సమీక్షా సమావేశాన్ని కార్యాలయంలోని కమీషనర్ ఛాంబర్ లో బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. ఈనెల 26వ తేదీ నుంచి ఐదు రోజుల పాటు పండుగ జరిగే దర్గా ప్రాంగణంలో మంచినీటి సదుపాయం, హై మాక్స్ విద్యుత్ లైట్లు, తాత్కాలిక అంతర్గత దారుల నిర్మాణం, పారిశుద్ధ్య నిర్వహణ, బ్లీచింగ్, సున్నం, మొబైల్ టాయిలెట్లు, బయో టాయిలెట్లు, రిసెప్షన్ సెంటర్ ఏర్పాటు, సి.సి కెమెరాలు, పార్కింగ్ ఏర్పాట్లు, పార్కింగ్ ప్రాంతాల్లో వసతులు, మైక్ అనౌన్స్మెంట్, ఘాట్ ప్రాంతంలో షవర్ల ఏర్పాటు, దుకాణాల మార్కింగ్, రూట్ మ్యాప్ ల ప్రదర్శన, క్యూ ఆర్ కోడ్ స్కానర్ల ద్వారా మార్గం వివరాలు, బారికేడ్ల నిర్మాణం తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఈ సమావేశంలో డిప్యూటీ కమిషనర్ చెన్నుడు, ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ దినేష్, ఇంజనీరింగ్ విభాగం ఎస్.ఈ రహంతు జానీ, ఈ.ఈ లు శేషగిరిరావు, అనిల్ కుమార్, సిటీ ప్లానర్ రఘురాధరావు, టి.పి.ఆర్.ఓ వాసు బాబు, మేనేజర్ రాజేశ్వరి, వెటర్నరీ డాక్టర్ మదన్ మోహన్, రెవెన్యూ అధికారులు సమద్, శ్రీనివాసులు, సూపరింటెండెంట్ లు, శానిటేషన్ సూపర్ వైజర్లు, సిబ్బంది పాల్గొన్నారు.


