పాఠశాల విద్యాశాఖ సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఎన్జీఓ హోంలో ప్రత్యేక అవసరాలున్న 394 మంది విద్యార్థులకు రూ.22.14 లక్షల విలువైన ఉచిత సహాయక ఉపకరణాలను పంపిణీ చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ మాట్లాడుతూ 2025–26 విద్యా సంవత్సరంలో విభిన్న ప్రతిభావంతుల విద్యార్థుల కోసం ప్రభుత్వం స్కాలర్షిప్లు, ఎస్కార్ట్ అలవెన్స్, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్, బాలికల స్టైపెండ్, హోమ్బేస్డ్ ఎడ్యుకేషన్ తదితర పథకాల కోసం రూ.71.82 లక్షలు కేటాయించినట్లు తెలిపారు.
నెల్లూరు మేయర్ దేవరకొండ సుజాత మాట్లాడుతూ నగర పాలక సంస్థ తరఫున ప్రత్యేక అవసరాలున్న పిల్లలకు అవసరమైన సౌకర్యాల కల్పనకు కట్టుబడి ఉన్నామని చెప్పారు. జిల్లా విద్యాశాఖాధికారి డా. రాజా బాలాజీ రావు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందుతున్నందున విభిన్న ప్రతిభావంతుల విద్యార్థులు కూడా ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నారని, తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలలను ప్రోత్సహించాలని కోరారు.
అదనపు ప్రాజెక్టు కోఆర్డినేటర్ డి. వెంకట సుబ్బయ్య మాట్లాడుతూ పీఎం శ్రీ పథకం కింద నెల్లూరు, బుచ్చిరెడ్డిపాలెం, ఆత్మకూరు, కావలి, వింజమూరు, గూడూరులో ఆరు ఆటిజం కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. వీటి ద్వారా ఒక్కో విద్యార్థికి రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకు ఉచిత వైద్య సేవలు, ఫిజియోథెరపీ అందించనున్నట్లు వెల్లడించారు.
పంపిణీ చేసిన పరికరాల్లో టీఎల్ఎం కిట్లు, హియరింగ్ ఎయిడ్స్, బ్రెయిల్ కిట్లు, వీల్చైర్లు, బ్యాటరీ ఆపరేటెడ్ మోటరైజ్డ్ ట్రైసైకిళ్లు, రోలేటర్లు తదితర ఉపకరణాలు ఉన్నాయి. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ బొబ్బల శ్రీనివాస యాదవ్, ఏఎంఓ సుధీర్ బాబు, ఐఈ కోఆర్డినేటర్ ప్రసాద్రావు, మండల విద్యాశాఖాధికారి మురళి, అలింకో ప్రతినిధి సోని యాదవ్, సమగ్ర శిక్ష అధికారులు, ఐఈఆర్పీలు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.



