మద్యం ధరలు పెరగనున్నాయనే వార్తలు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. జూన్ 2 తర్వాత మద్యం ధరలను 10 శాతం నుండి 15 శాతం వరకు పెంచే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు సమాచారం.
ఇప్పటికే మద్యం ధరల సవరణపై ప్రభుత్వం నియమించిన త్రిసభ్య కమిటీ తమ నివేదికను సమర్పించినట్లు తెలుస్తోంది. ఆ కమిటీ మద్యం రేట్లను 25% నుండి 30% వరకు పెంచాలని ప్రతిపాదనలు ఇచ్చినట్లు సమాచారం.
రాష్ట్ర ఆదాయాన్ని పెంచడం, ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ధరల సమతౌల్యం తీసుకురావడం లక్ష్యంగా ఈ నిర్ణయం ఉండవచ్చని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే తుది నిర్ణయం ప్రభుత్వం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.
ధరల పెంపు అమల్లోకి వస్తే బీరు, విస్కీ, బ్రాండీ సహా అన్ని రకాల మద్యం బ్రాండ్లపై ప్రభావం పడే అవకాశం ఉంది. దీంతో మద్యం వినియోగదారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.



