*ఏపీలో ఎంత గ్యాస్ ఉంది.. ఎన్ని రోజులు సరిపోతుంది.? వివరాలు వెల్లడించిన చంద్రబాబు*
ఇరాన్ – ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఎల్పీజీ గ్యాస్ సరఫరాకు ఆటంకం కలుగుతోంది. దీంతో దేశంలో వాణిజ్య ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల కొరత నెలకొంది.
గృహ వినియోగదారులకు అవసరమైన ఎల్పీజీ గ్యాస్ నిల్వలు అందుబాటులో ఉన్నాయని ప్రభుత్వం పదే పదే చెప్తున్నప్పటికీ.. వినియోగదారులు మాత్రం పానిక్ బుకింగ్స్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్యాస్ సరఫరా అంశంపై సీఎం నారా చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. ఆర్టీజీఎస్ నుంచి గ్యాస్ సరఫరా అంశంపై సమీక్ష జరిపారు. ఈ సమీక్షలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్, పెట్రోలియం కంపెనీల ప్రతినిధులతో పాటుగా వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం చంద్రబాబు నాయుడు.. రాష్ట్రంలో ప్రస్తుతం14 వేల మెట్రిక్ టన్నుల ఎల్పీజీ గ్యాస్ నిల్వలు అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు. మరో 15 రోజులకు సరిపడా గ్యాస్ నిల్వలు అందుబాటులో ఉన్నాయని.. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. త్వరలోనే మరికొన్ని మెట్రిక్ టన్నుల గ్యాస్ అందుబాటులోకి వస్తోందని.. ఆంధ్రప్రదేశ్లో ఎల్పీజీ సరఫరాకు ఇబ్బందులు లేవని చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఆస్పత్రులు, హాస్టళ్లు, ఆలయాలకు గ్యాస్ సరఫరాలో ఎలాంటి కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. మరోవైపు ప్రజలకు తక్షణమే అందుబాటులోకి వచ్చే ప్రత్యామ్నాయాల గురించి అధికారులు ఆలోచించాలని చంద్రబాబు సూచించారు. రాష్ట్రంలో ఇండక్షన్ స్టవ్స్ స్టాక్ పెంచాలని ఆదేశించారు.
మరోవైపు గ్యాస్ సిలిండర్ల రీఫిల్ బుకింగ్ ఈ కేవైసీ, ఓటీపీల ద్వారా చేపట్టాలని చంద్రబాబు గ్యాస్ ఏజెన్సీలు, కంపెనీలకు స్పష్టం చేశారు. సిలిండర్లు పక్కదారి పట్టకుండా చూడాలన్నారు. గ్యాస్ కంపెనీలు కొన్నిరోజులు ఉత్పత్తిని పెంచాలని.. మెరుగైన పంపిణీ చేపట్టాలని సూచించారు. గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ను విస్తరించాలని సూచించారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా గోదావరి బేసిన్లో ఉత్పత్తి అయ్యే సహజవాయువును పైప్డ్ నెట్వర్క్ ద్వారా సరఫరా చేసే అంశాన్ని ఆలోచన చేయాలని సూచించారు. అలాగే సీఎన్జీ, పీఎన్జీ గ్యాస్ వినియోగం పెంచేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని చంద్రబాబు నాయుడు సమీక్ష సందర్భంగా అధికారులకు సూచించారు.

