ది.20.09.2025
*ప్రాధాన్యత క్రమంలో అభివృద్ధి పనులు చేపట్టండి..*
*జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి*
*టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్ అధికారులతో సమీక్ష*
ప్రజల్లో సంతృప్తి ఉండేలా.. ప్రాధాన్యత క్రమంలో నగరంలో అభివృద్ధి పనులను చేపట్టాలని అధికారులకు జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి సూచించారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్ విభాగాధిపతులతో శనివారం సమీక్ష నిర్వహించారు. తొలుత నగరంలో జరుగుతున్న రోడ్డు విస్తరణ పనులపై ఆరా తీశారు. మొదటి దశలో చేపట్టిన 15 రహదారుల విస్తరణ పనులను నెల రోజుల్లోగా పూర్తి చేయవలసిందిగా ఆదేశించారు. అనంతరం పురోగతిలో ఉన్న అభివృద్ధి పనులపై డివిజన్ల వారీగా సమీక్షించారు. వర్షాల కారణంగా ముంపునకు గురవుతున్న ప్రాంతాల గూర్చి అడిగి తెలుసుకున్నారు. లోతట్టు వీధులలో నీరు నిలిచిపోకుండా సమగ్ర యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయవలసిందిగా ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. త్రాగునీటి సరఫరాలో ఎక్కడా ఫిర్యాదులు రాకూడదని.. కనుక నీటిని ప్రతీరోజు పరీక్షించాలన్నారు. మురుగు కాలువల్లో ఎక్కడైనా తాగునీటి పైపులైన్లు ఉన్నట్లయితే తక్షణమే మార్చాలన్నారు. అలాగే జంక్షన్ ల అభివృద్ధి పనులను టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్ అధికారులు సమన్వయంతో ప్రజలకు ఎక్కడా అసౌకర్యం కలగకుండా ప్రాధాన్యత క్రమంలో చేపట్టాలన్నారు. సమావేశంలో అడిషనల్ కమిషనర్ పి.వి.రామలింగేశ్వర్, డిప్యూటీ కమిషనర్ ఎస్.వెంకటరమణ, సెక్రటరీ జి.శైలజ వల్లి, సిటీ ప్లానర్ జి.కోటయ్య, ఎస్ఈ(ఇంఛార్జి) రీటా, ఎంహెచ్ఓ వినూత్న, రెవెన్యూ అధికారులు సీహెచ్ శ్రీనివాసరావు, రవికుమార్, మేనేజర్ ఎండి అబ్దుల్ మాలిక్, ఈఈలు మాధవి, మదర్సా అలీ, అకౌంటెంట్ నాగమణి, సీఎంఎం రామలక్ష్మి, ఏసీపీలు, ఇతర అధికారులు పాల్గొన్నారు.


