నెల్లూరు, కాకుటూరు: జాతీయ విద్యా విధానం 2020 (NEP 2020)లో భాగంగా భారతీయ జ్ఞాన వ్యవస్థ (Indian Knowledge System – IKS)ను విద్యా రంగంలో సమన్వయం చేయడం లక్ష్యంగా విక్రమ సింహపురి విశ్వవిద్యాలయంలో మంగళవారం ప్యానల్ చర్చను ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య అల్లం శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా, రిజిస్ట్రార్ డా. కె. సునీత విశిష్ట అతిథిగా, RIE ప్రిన్సిపాల్ ఆచార్య బి. రమేష్ బాబు గౌరవ అతిథిగా పాల్గొన్నారు.
ఉపకులపతి ఆచార్య అల్లం శ్రీనివాసరావు మాట్లాడుతూ, “భారతీయ జ్ఞాన వ్యవస్థ అనేది వేదాలు, ఉపనిషత్తులు, ఆయుర్వేదం, యోగం, గణితం, ఖగోళశాస్త్రం వంటి శాస్త్రాల సమాహారం. ఇవి మన దేశపు మేధోసంపదకు పునాది. NEP 2020 ద్వారా ఈ జ్ఞానాన్ని పాఠ్యాంశాల్లో చేర్చడం వల్ల విద్యార్థులలో పరిశోధనా దృక్పథం పెరుగుతుంది, సృజనాత్మకతకు దోహదం చేస్తుంది మరియు సమగ్ర విద్యా అభివృద్ధికి దోహదపడుతుంది” అన్నారు.
రిజిస్ట్రార్ డా. కె. సునీత మాట్లాడుతూ, “భారతీయ జ్ఞాన వ్యవస్థ సమన్వయం విద్యార్థులలో సమగ్రతను, సాంస్కృతిక అవగాహనను పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది” అన్నారు.
గౌరవ అతిథి ఆచార్య బి. రమేష్ బాబు మాట్లాడుతూ, “భారతీయ జ్ఞాన సంపదను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో మేళవించడం ద్వారా విద్యా ప్రమాణాలు మెరుగుపడతాయి” అని తెలిపారు.
డీన్ ఆర్ & డి ఆచార్య సుజా ఎస్. నాయర్ మాట్లాడుతూ, “IKS ను విద్యా వ్యవస్థలో చేర్చడం వలన విద్యార్థులు కేవలం సాంకేతిక జ్ఞానంతో కాకుండా సాంస్కృతిక, నైతిక విలువలతో కూడిన సమగ్ర వ్యక్తిత్వాన్ని పొందగలరు. అంతరశాఖ పరిశోధన మరియు ప్రాజెక్టుల ద్వారా దీనిని మరింత విస్తరించవచ్చు” అన్నారు.
ప్యానల్ చర్చలో విద్యావేత్తలు, సాంస్కృతిక చరిత్రకారులు, ఆయుర్వేద నిపుణులు, పరిశోధకులు పాల్గొని IKS చరిత్రాత్మక ప్రాముఖ్యత, ఆధునిక సమాజంలో అన్వయం, సవాళ్లు మరియు భవిష్యత్ మార్గదర్శకాలపై చర్చించారు.
NEP నోడల్ ఆఫీసర్ డా. ఆర్. మధుమతి మాట్లాడుతూ, “భారతీయ జ్ఞాన వ్యవస్థను విద్యా విధానంలో అనుసంధానం చేయడం వల్ల విద్యార్థుల్లో పరిశోధనాత్మక దృక్పథం పెరుగుతుంది. ఇది కేవలం పాఠ్యాంశాల పరిధిలోనే కాకుండా, నూతన ఆవిష్కరణలకు దారితీసే మార్గదర్శకంగా ఉంటుంది” అన్నారు.
UTSAH నోడల్ ఆఫీసర్ డా. జి. విజయలక్ష్మి మాట్లాడుతూ, “IKS సమన్వయం విద్యార్థుల్లో సృజనాత్మక ఆలోచనలను ప్రోత్సహించడం మాత్రమే కాకుండా, సమగ్ర వ్యక్తిత్వ వికాసానికి దోహదపడుతుంది. ఇది విద్యా రంగంలో కొత్త ఆవిష్కరణలకు మార్గం సుగమం చేస్తుంది” అన్నారు.
కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య సిహెచ్. విజయ మాట్లాడుతూ, “IKS విద్యా రంగానికి కొత్త దారులను చూపిస్తుంది. విద్యార్థులు దీని ద్వారా ఆవిష్కరణాత్మక ఆలోచనలను పెంపొందించుకుని భవిష్యత్తులో గ్లోబల్ స్థాయిలో పోటీపడగలరు” అన్నారు.
ఈ కార్యక్రమంలో డా. జె. విజయ, డా. బి. వి. సుబ్బా రెడ్డి, విద్యార్థినులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.


