విశాఖపట్నం నగర పోలీస్ కమిషనర్ ఆదేశాలు, ఉన్నతాధికారుల పర్యవేక్షణలో, పెందుర్తి ఇన్స్పెక్టర్ కె.వి. సతీష్ కుమార్ సూచనల మేరకు, సబ్ ఇన్స్పెక్టర్ ఎన్.వి. భాస్కరరావు విశ్వసనీయ సమాచారం ఆధారంగా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి, పెందుర్తి రైల్వే స్టేషన్ సమీపంలోని దగ్గువానిపాలెం ప్రాంతంలో గంజాయి ముద్దాయి కోసం వేచి ఉండగా, అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఒక వ్యక్తిని గుర్తించారు.
పోలీసులను చూసి పారిపోవడానికి ప్రయత్నించిన అతడిని వెంటనే అదుపులోకి తీసుకుని, మధ్యవర్తుల సమక్షంలో విచారించగా, తన పేరు పార్వాడ కనక రవి కిరణ్ (26), విజయవాడ అని తెలిపాడు. అతని వద్ద ఉన్న కాలేజ్ బ్యాగ్ను తనిఖీ చేయగా, మొత్తం 3 కిలోల గంజాయి రెండు ప్యాకెట్లలో లభించింది. అలాగే ఒక వోప్పో స్మార్ట్ ఫోన్ స్వాధీనం చేసుకుని, మొబైల్లోని కాల్ హిస్టరీ, వాట్సాప్ చాటింగ్ వివరాలను సేకరించి కేసు దర్యాప్తులో భాగంగా భద్రపరిచారు.
విచారణలో, అరకు ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి వద్ద నుంచి గంజాయిని కొనుగోలు చేసి విజయవాడలో విక్రయించేందుకు తీసుకెళ్తున్నట్లు ముద్దాయి ఒప్పుకున్నాడు. స్వాధీనం చేసుకున్న గంజాయి, మొబైల్ ఫోన్ తదితర వస్తువులను సీజ్ చేసి, నిందితుడిని అరెస్ట్ చేసి గౌరవ న్యాయస్థానం ఎదుట హాజరుపరిచారు. కేసు దర్యాప్తు కొనసాగుతోంది.
ప్రజలకు విజ్ఞప్తి
గంజాయి ఇతర మాదకద్రవ్యాల కొనుగోలు, అమ్మకం, రవాణా, నిల్వ, వినియోగం అన్నీ చట్టరీత్యా తీవ్రమైన నేరాలు. ఇవి యువత భవిష్యత్తును నాశనం చేయడంతో పాటు కుటుంబాలు, సమాజంపై తీవ్ర ప్రభావం చూపుతాయి.
మాదకద్రవ్యాలకు సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్కు లేదా డయల్-112కు సమాచారం అందించాలని ప్రజలకు పెందుర్తి పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
“మత్తు పదార్థాలకు దూరంగా ఉండండి… ఆరోగ్యకరమైన, సురక్షితమైన సమాజ నిర్మాణానికి పోలీసులకు సహకరించండి.”

