ఖమ్మం జూన్
(పువ్వాడ నాగేంద్ర కుమార్
పున్నమి న్యూస్ జిల్లా రిపోర్టర్ )
ఖమ్మం నగరంలోని శ్రీనివాస్ నగర్ 17వ డివిజన్లో వినాయకుడి గుడి సమీప ప్రాంతంలో అత్యవసరంగా కాలువ నిర్మాణం చేపట్టాలని కోరుతూ భారతీయ జనతా పార్టీ నాయకులు మంగళవారం డిప్యూటీ కమిషనర్కు వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా బీజేపీ ఖమ్మం జిల్లా నాయకులు కొమ్మ మధు యాదవ్ మాట్లాడుతూ, గత 25 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో నివసిస్తున్న సుమారు 140 కుటుంబాలు సరైన కాలువ సదుపాయం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని తెలిపారు. ముఖ్యంగా వర్షాకాలంలో మురుగునీరు ఇళ్ల మధ్య నిల్వ ఉండటంతో ప్రజలు అనారోగ్య సమస్యలు, దుర్వాసనలు మరియు పారిశుద్ధ్య సమస్యలతో బాధపడుతున్నారని పేర్కొన్నారు.
కాలువ లేకపోవడం వల్ల వర్షపు నీరు, మురుగునీరు రోడ్లపై నిలిచిపోతూ ప్రజల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నారులు, వృద్ధులు ఎక్కువగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు
స్థానిక ప్రజల సమస్యలను దృష్టిలో ఉంచుకొని వెంటనే కాలువ నిర్మాణ పనులు చేపట్టి శాశ్వత పరిష్కారం కల్పించాలని డిప్యూటీ కమిషనర్ను కోరినట్లు కొమ్మ మధు యాదవ్ తెలిపారు. ప్రజల ఆరోగ్యం, భద్రత మరియు పారిశుద్ధ్య పరిరక్షణ కోసం అధికారులు వెంటనే స్పందించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షులు నకరికంటి వీరభద్రం, జిల్లా కోశాధికారి కోనతం లక్ష్మీనారాయణ, ఉమ్మడి ఖమ్మం జిల్లా సోషల్ మీడియా మాజీ కన్వీనర్ శాసనాల సాయిరాం, జిల్లా నాయకులు బట్టు రాహుల్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.


