సచివాలయం తొలగిస్తే ఓటు బహిస్కరిస్తాం.ముంగండపాలెం గ్రామ ప్రజలు ఆందోళన
పి.గన్నవరం నుండి పున్నమి ప్రతినిధి. ఆగస్టు 27 డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జిల్లా పి గన్నవరం మండలం
ముంగండపాలెంలో ఏర్పాటు చేసిన గ్రామ సచివాలయాన్ని అదే గ్రామంలో కొనసాగించాలని డిమాండ్ చేస్తూ గ్రామ ప్రజలు ఆందోళన చేపట్టారు.కోర్టులో కేసు పెండింగ్లో ఉన్నప్పటికీ సచివాలయాన్ని ఆర్. ఏనుగుపల్లికి తరలించేందుకు అధికారులు ప్రయత్నించడం పట్ల గ్రామస్థులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.సచివాలయ వ్యవస్థ ప్రారంభ సమయంలో జనాభా ప్రాతిపదికన ముంగండపాలెంలో గ్రామ సచివాలయం ఏర్పాటు చేశారు. 2011 జనాభా ప్రకారం ముంగండపాలెంలో 1,681 ఓట్లు ఉండగా,ఆర్.ఏనుగుపల్లిలో 1,200 ఓట్లు ఉన్నాయని గ్రామస్థులు తెలిపారు.అనంతరం సచివాలయాన్ని ఆర్.ఏనుగుపల్లికి మార్చేందుకు ప్రయత్నాలు జరగడంతో ముంగండపాలెం గ్రామ ప్రజలు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ముంగండపాలెంలో సచివాలయానికి అవసరమైన అన్ని వసతులు ఉన్నాయని కోర్టుకు వివరించినట్లు గ్రామస్థులు తెలిపారు.అయితే కేసు న్యాయస్థానంలో పెండింగ్లో ఉండగానే ఆర్. ఏనుగుపల్లిలో సచివాలయ భవన నిర్మాణం చేపట్టారని గ్రామస్థులు ఆరోపించారు. ప్రస్తుతం కూడా కేసు కోర్టులో పెండింగ్లో ఉండగా,కోర్టు తుది తీర్పు వెలువడకముందే సచివాలయాన్ని తరలించేందుకు అధికారులు చర్యలు తీసుకోవడం సరికాదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.కోర్టు తీర్పు వచ్చే వరకు సచివాలయం తరలింపు ప్రక్రియను నిలిపివేయాలి. ముంగండపాలెంలోనే గ్రామ సచివాలయాన్ని కొనసాగించాలని గ్రామస్థులు డిమాండ్ చేశారు.తమ సమస్యపై అధికారులు స్పందించకపోతే ప్రజాస్వామ్య పద్ధతిలో మరింత పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని, అవసరమైతే ఎన్నికలను బహిష్కరించే నిర్ణయం తీసుకుంటామని గ్రామ ప్రజలు హెచ్చరించారు.స్థానిక ఎమ్మెల్యే గారు,కూటమి ప్రభుత్వం ఈ సమస్యపై వెంటనే స్పందించి, కోర్టు కేసు మరియు గ్రామ ప్రజల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని ముంగండపాలెంలోనే గ్రామ సచివాలయం కొనసాగించేలా న్యాయం చేయాలని గ్రామ ప్రజలు విజ్ఞప్తి చేశారు.


