ఆత్మకూరు, జూలై 1 (హరికిరణ్, పున్నమి ప్రతినిధి):
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకం ద్వారా లబ్ధిదారులకు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారు స్వయంగా పింఛన్లు పంపిణీ చేశారు.ఆత్మకూరు నియోజకవర్గంలోని ఏఎస్ పేట మండలం శ్రీకొలను గ్రామంలోని గిరిజన కాలనీలో బుధవారం మంత్రి లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్ మొత్తాన్ని అందజేశారు.
అనంతరం నిర్వహించిన సభలో వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, ఇతర పింఛన్ లబ్ధిదారులతో పాటు బ్రాహ్మణ లబ్ధిదారులతో మంత్రి ఆప్యాయంగా మాట్లాడి వారి సమస్యలు, యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి ఆనం తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రతి నెలా ఒకటో తేదీన లబ్ధిదారుల ఇంటి వద్దకే పింఛన్లు అందించే కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోందన్నారు.శ్రీకొలను గ్రామపంచాయతీ పరిధిలో మొత్తం 305 మంది లబ్ధిదారులకు రూ.12.86 లక్షల పింఛన్ మొత్తాన్ని పంపిణీ చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు.అలాగే ఆత్మకూరు నియోజకవర్గ పరిధిలో 36,354 మంది లబ్ధిదారులకు రూ.16.22 కోట్లకు పైగా, నెల్లూరు జిల్లాలో 2,87,345 మంది లబ్ధిదారులకు రూ.127.23 కోట్లకు పైగా పింఛన్ మొత్తాన్ని ప్రభుత్వం అందజేస్తోందని తెలిపారు.ఇటీవల అనారోగ్యంతో చికిత్స పొంది ఆర్థిక సహాయం కోరిన ఏఎస్ పేట మండలానికి చెందిన మూడు కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) చెక్కులను మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అందజేశారు.ఆత్మకూరు నియోజకవర్గ పరిధిలో గత రెండేళ్లలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ద్వారా 876 కుటుంబాలకు రూ.8 కోట్ల 19 లక్షల 76 వేల 563 రూపాయల ప్రభుత్వ సహాయం అందించామని మంత్రి తెలిపారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామ ప్రముఖులు పాల్గొన్నారు.


