18వ డివిజన్లో డోర్ టు డోర్ టీడీపీ కార్యక్రమం
కడప, ఆగస్టు 24: జన ప్రగతి
కడప నగరంలోని 18వ డివిజన్లో ఆదివారం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో డోర్ టు డోర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కమలాపురం ఎమ్మెల్యే పుత్తా చైతన్యరెడ్డి, అడిషనల్ మున్సిపల్ కమిషనర్ రాకేష్ చంద్ర పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే పుత్తా చైతన్యరెడ్డి, అధికారులు, టీడీపీ నాయకులు డివిజన్లోని పలు ప్రాంతాల్లో ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలుసుకుని వారి సమస్యలు, అవసరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలు తమ దృష్టికి తీసుకొచ్చిన సమస్యల్లో సాధ్యమైన వాటిని అక్కడికక్కడే పరిష్కరించేందుకు చర్యలు తీసుకున్నారు. పరిష్కరించాల్సిన ఇతర సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని ప్రజలకు హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రజలు తమ సమస్యలను తీసుకొచ్చినప్పుడు వారికి తగిన సూచనలు, సలహాలు అందించాలని, సమస్య ఏ విధంగా పరిష్కారం అవుతుందో ప్రజలకు స్పష్టంగా తెలియజేయాలని సూచించారు.
రెండు నెలల్లో విశ్వనాథపురం రైల్వే బ్రిడ్జి ప్రారంభిస్తాం
అనంతరం ఎమ్మెల్యే పుత్తా చైతన్యరెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న విశ్వనాథపురం రైల్వే బ్రిడ్జి నిర్మాణ పనులను రెండు నెలల్లో పూర్తి చేసి ప్రారంభించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
రైల్వే బ్రిడ్జి నిర్మాణానికి అవసరమైన నిధులు ఇస్తామని కార్పొరేషన్ అధికారులు గతంలో హామీ ఇచ్చినప్పటికీ అనంతరం నిధులు ఇవ్వలేమని చెప్పడంతో పనులు ఆలస్యమయ్యాయని వివరించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేక కలెక్టర్ ద్వారా అవసరమైన అనుమతులు పొందేందుకు చర్యలు తీసుకున్నామని తెలిపారు.
బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించిన నిధులు ఆర్డీఓ ఖాతాలో జమ అయ్యేలా చర్యలు చేపట్టామని, త్వరలోనే నిధులు జమ చేసి పనులను ప్రారంభిస్తామని ఎమ్మెల్యే వెల్లడించారు. బ్రిడ్జి నిర్మాణ పనులకు ప్రజలు సహకరించాలని కోరారు.
కూటమి ప్రభుత్వం పాలనలో చిన్నచిన్న సమస్యలు మినహా ప్రజలు సంతోషంగా ఉన్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఆవుల నాగేశ్వరరెడ్డి, గంధం మోహన్, కృష్ణారెడ్డి, రామసుబ్బయ్య, సాయికుమార్, ప్రసాద్, పవన్ కుమార్, రామచంద్రుడు తదితరులు పాల్గొన్నారు.




