*దోరవారిసత్రం, సెప్టెంబర్ 5:* తిరుపతి జిల్లా దోరవారిసత్రం మండలం పోలిరెడ్డిపాలెం గ్రామంలో వీధి దీపాలు వెలగక గ్రామం నిత్యం చీకట్లో మగ్గుతోంది. ఫోటోలో కనిపిస్తున్నట్లుగా స్తంభానికి ఉన్న లైటు గత కొన్ని నెలలుగా వెలగడం లేదు. సాయంత్రం 6 గంటలు దాటితే చాలు గ్రామంలోని వీధులన్నీ చీకటిమయంగా మారుతున్నాయి.
ఈ విషయంపై గ్రామస్తులు పంచాయతీ అధికారులకు, సచివాలయ సిబ్బందికి, EB అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా ఏ ఒక్క అధికారి పట్టించుకోవడం లేదని గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వీధి దీపాలు లేకపోవడంతో రాత్రి వేళల్లో మహిళలు, వృద్ధులు, చిన్న పిల్లలు బయటకు రావాలంటే భయపడుతున్నారు. పాములు, తేళ్ల భయంతో పాటు దొంగల భయం కూడా పెరిగిందని గ్రామస్తులు వాపోతున్నారు. గ్రామంలో చెత్త కూడా పేరుకుపోయి దోమల బెడద పెరిగిందని, అయినా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు.
కావున జిల్లా కలెక్టర్ గారు, దోరవారిసత్రం MDO గారు వెంటనే స్పందించి పోలిరెడ్డిపాలెం గ్రామంలో వెలగని వీధి దీపాలను తక్షణమే బాగు చేయించి, గ్రామంలో వెలుగులు నింపాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.
*- పోలిరెడ్డిపాలెం గ్రామ ప్రజలు, దోరవారిసత్రం మండలం, తిరుపతి జిల్లా.*


