సిద్ధవటం మండలం చాముండేశ్వరి పేట గ్రామంలో వెలసిన శ్రీ సీతారామ ఆలయంలో శుక్రవారం కలశ పూజా కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయాన్ని ప్రత్యేకంగా అలంకరించి, వేద పండితుల ఆధ్వర్యంలో స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. అనంతరం వేదమంత్రోచ్ఛారణల మధ్య ఆలయ గాలిగోపురంపై పంచలోహ కలశాన్ని శాస్త్రోక్తంగా ప్రతిష్ఠించారు.
కలశ ప్రతిష్ఠ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ ప్రాంగణం భక్తులతో సందడిగా మారగా, ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు ఆలయ నిర్వాహకులు, గ్రామ పెద్దలు ఏర్పాట్లు చేశారు.


