కుమురం భీమ్ ఆసిఫాబాద్, జూలై 21: గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్య, పోషకాహారం, ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించడంలో ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించబోమని జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి జాదవ్ అంబాజీ స్పష్టం చేశారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆశ్రమ గిరిజన బాలికల పాఠశాలలో మంగళవారం నిర్వహించిన ఆశ్రమ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, వసతి గృహ అధికారులు, ఎస్సీఆర్పీల సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు.
జిల్లాలోని 52 ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాల్లో విద్యార్థులకు ప్రతిరోజూ నాణ్యమైన పోషకాహారం అందించడంతో పాటు పరిశుభ్రమైన వాతావరణాన్ని కల్పించడం ప్రతి అధికారి బాధ్యత అని పేర్కొన్నారు. పాఠశాల సిబ్బంది సమిష్టి బాధ్యతతో, పరస్పర సహకారంతో పనిచేస్తూ విద్యార్థుల సంక్షేమాన్ని ప్రధాన లక్ష్యంగా తీసుకోవాలని సూచించారు. ప్రధానోపాధ్యాయులు, వసతి గృహ అధికారులు తప్పనిసరిగా హెడ్క్వార్టర్స్లోనే ఉంటూ విద్యార్థుల చదువు, ఆరోగ్యం, క్రమశిక్షణ, భద్రతపై నిరంతరం పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు.
ఈ విద్యా సంవత్సరంలో FLN మరియు LEAP కార్యక్రమాలను వంద శాతం విజయవంతం చేయాలని ఎస్సీఆర్పీలకు సూచించారు. ప్రతి విద్యార్థి విద్యా పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని, నిర్ణీత గడువులోగా సిలబస్ పూర్తి చేసి పునశ్చరణకు తగిన సమయం కేటాయించాలని ఆదేశించారు.
GCC ద్వారా సరఫరా అయ్యే బియ్యం, పప్పులు, ఇతర నిత్యావసర సరుకులను పూర్తిగా పరిశీలించి నాణ్యత ప్రమాణాలు పాటించినవే స్వీకరించాలని, నాసిరకం సరుకులను ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోవద్దని స్పష్టం చేశారు. అలాగే వసతి గృహాల్లోకి బయట నుంచి వచ్చే ఆహార పదార్థాలను పూర్తిగా నిషేధించాలని, వంటశాలలు, భోజనశాలలు, హాస్టల్ ప్రాంగణం ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
విద్యార్థుల ఆరోగ్యం, భద్రత విషయంలో ఏమాత్రం అలసత్వం ప్రదర్శించినా సంబంధిత అధికారులపై బాధ్యత నిర్ణయించి కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి హెచ్చరించారు.
ఈ సమావేశంలో PMRC ACMO పూర్కా ఉద్ధవ్, జిల్లా క్రీడల అధికారి మడావి శేఖు, GCDO కె. శకుంతల, కాగజ్నగర్ ATDO భాస్కర్, జైనూర్ ATDO శ్రీనివాస్, ఆసిఫాబాద్ ATDO చిరంజీవితో పాటు జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆశ్రమ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, వసతి గృహ అధికారులు పాల్గొన్నారు.



