వియత్నాం బోటు ప్రమాద బాధితుడి కుటుంబాన్ని పరామర్శించిన జిల్లా కలెక్టర్
కడప, జూలై 14: వియత్నాం బోటు ప్రమాదంలో మృతి చెందిన ముడియం శ్రీధర్ పార్థివదేహం కడపకు చేరుకున్న సందర్భంగా జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి మంగళవారం వారి నివాసానికి వెళ్లి నివాళులర్పించారు.
అనంతరం మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించిన కలెక్టర్, వారి అకాల మరణం తీవ్ర విషాదకరమని పేర్కొన్నారు. ఈ క్లిష్ట సమయంలో కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని సూచిస్తూ, జిల్లా యంత్రాంగం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
మృతుడు పనిచేసిన సంస్థ నుంచి అందాల్సిన పరిహారం, ఇతర సహాయ సహకారాలు త్వరితగతిన అందేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. శ్రీధర్ ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు మనోధైర్యం కలగాలని ఆకాంక్షిస్తూ ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో కడప ఆర్డీవో మురళి, కేఎంసీ కమిషనర్ భవానీ ప్రసాద్, అదనపు కమిషనర్ రాకేష్ చంద్రం తదితర అధికారులు పాల్గొన్నారు.

