శ్రీసిటీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన వేసవి శిబిరం విద్యార్థులకు విజ్ఞానంతో పాటు వినోదం, ఆహ్లాదాన్ని అందించిందని పాల్గొన్న విద్యార్థులు తెలిపారు. గత నెల 27న ఇరుగుళం జడ్పీ హైస్కూల్లో ప్రారంభమైన ఈ శిబిరం శుక్రవారం ముగిసింది. స్థానిక అకార్డ్ స్కూల్ సమావేశ మందిరంలో నిర్వహించిన ముగింపు కార్యక్రమంలో విద్యార్థులు తమ అనుభవాలను పంచుకున్నారు.
ఏప్రిల్ 27 నుంచి మే 29 వరకు సాగిన ఈ శిబిరంలో 8, 9, 10వ తరగతుల పరీక్షలు పూర్తి చేసిన 68 మంది విద్యార్థులు పాల్గొనగా, 50 మంది చివరి వరకు హాజరయ్యారు. స్పోకెన్ ఇంగ్లీష్, గణితం, వేదిక్ మ్యాథ్స్, కంప్యూటర్ శిక్షణ, వ్రాత నైపుణ్యాలు, పోటీ పరీక్షల మెళకువలు, హస్తకళలు వంటి అంశాల్లో శిక్షణ అందించారు. యోగా, వాలీబాల్, టేబుల్ టెన్నిస్ తదితర క్రీడల్లోనూ తర్ఫీదు ఇచ్చారు.
తిరుపతిలోని జంతు సంరక్షణ కేంద్రం, సైన్స్ సెంటర్, ఇస్కాన్ ఆలయం, అలాగే శ్రీసిటీలోని పెప్సీ, వైటల్ పేపర్స్ పరిశ్రమలను విద్యార్థులు సందర్శించారు. ఆరోగ్య, నేత్ర, దంత వైద్య శిబిరాలు కూడా నిర్వహించారు.
శ్రీసిటీ డైరెక్టర్ (సీఎస్ఆర్) నిరీషా సన్నారెడ్డి మాట్లాడుతూ గ్రామీణ విద్యార్థులకు విజ్ఞానం, నైపుణ్యాభివృద్ధి అవకాశాలు కల్పించడమే లక్ష్యమన్నారు. ప్రతిఏటా మరిన్ని వినూత్న కోర్సులతో ఈ శిబిరాన్ని నిర్వహిస్తామని తెలిపారు. ముగింపు కార్యక్రమంలో క్రీడా పోటీల విజేతలకు బహుమతులు అందజేయగా, విద్యార్థులు సాంస్కృతిక ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు.



