యలమంచిలి : పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్
క్యాన్సర్తో సతమతమవుతున్న కుటుంబానికి చేయూత… 20 వేల రూపాయల చెక్ అందజేత
యలమంచిలి : పట్టణంలోని 10వ తరగతి 1996-97 విద్యా సంవత్సరానికి చెందిన పూర్వ విద్యార్థులంతా ఏకమై సమాజసేవా సంకల్పంతో స్థాపించిన ‘మనం చారిటబుల్ ట్రస్ట్’ మరోసారి తన సేవా స్పూర్తిని చాటుకుంది. మిత్రుల బాధను తెలుసుకుని సాయం చేయడం ద్వారా నిజమైన స్నేహానికి నిదర్శనంగా నిలిచింది.
2019లో స్థాపించబడిన ఈ ట్రస్ట్, యలమంచిలి పరిసర ప్రాంతాల్లోనే కాకుండా ఎవరు సహాయం అడిగినా కాదనకుండా పలు సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ విశేష ఖ్యాతిని సంపాదించింది. కరోనా తొలి దశలో అందరూ ఇంటికే పరిమితమైన సమయంలో కూడా సభ్యులు బయటకు వచ్చి ప్రజలకు ఆహారం, నిత్యావసర సరుకులు అందజేసి యలమంచిలి ప్రజల హృదయాలను గెలుచుకున్నారు. అంతేకాకుండా కరోనా రెండవ వేవ్లో ఆక్సిజన్ కొరత ఏర్పడిన నేపథ్యంలో కమ్యూనిటీ హెల్త్ సెంటర్లకు ఆక్సిజన్ సరఫరా చేసి అనేకుల ప్రాణాలను కాపాడారు. విద్య, ఆరోగ్య రంగాలపై ప్రత్యేక శ్రద్ధ చూపుతూ నిరాశ్రయులకు చేయూత అందిస్తూ వస్తున్నారు.
ఈ క్రమంలోనే తమ మిత్రుడైన దళపతి బట్ భార్య విద్యా కుమార్ బట్ లివర్ క్యాన్సర్తో బాధపడుతూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయాన్ని ట్రస్ట్ సభ్యులు తెలుసుకున్నారు. వెంటనే స్పందించిన సభ్యులు దళపతి బట్కు రూ. 20,000 చెక్కును అందజేసి “మేమంతా ఉన్నాం” అనే ధైర్యాన్ని కల్పించారు.
ఈ కార్యక్రమంలో ట్రస్ట్ అధ్యక్షుడు మురుకుర్తి గోపి, ఉపాధ్యక్షుడు స్. సతీష్, వ్యవస్థాపక కార్యదర్శి పి. సురేష్, కోశాధికారి సి.హెచ్. శ్యామలరావు, సభ్యులు కర్రి వీరు నాయుడు మాస్టారు, తంగేటి సూర్య ప్రకాష్, అనపర్తి మణి కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ట్రస్ట్ సభ్యులు మాట్లాడుతూ, “సమాజంలో ఎవరు ఏ కష్టంలో ఉన్నా తమ తోడ్పాటు ఎప్పుడూ ఉంటుందని స్పష్టంచేశారు. మిత్రుడి కుటుంబం త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాం. అవసరమైతే మరింత సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాం” అని పేర్కొన్నారు.

