మౌంట్ అబూ, రాజస్థాన్ ఏప్రిల్ (| పున్నమి ప్రతినిధి)
మౌంట్ అబూలోని జ్ఞాన సరోవర్ ఆధ్యాత్మిక వాతావరణంలో బ్రహ్మకుమారీస్ మీడియా విభాగం ఆధ్వర్యంలో జాతీయ మీడియా సదస్సు ఘనంగా ప్రారంభమైంది. దేశం నలుమూలల నుంచి ప్రముఖ జర్నలిస్టులు, మీడియా ప్రతినిధులు, సృజనాత్మక రచయితలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రపంచ శాంతి అవసరంలో మీడియా పాత్రపై లోతైన చర్చలు ప్రారంభించారు.
బీకే చందా దీది సమన్వయంతో జరిగిన స్వాగత సమావేశం బీకే యుగరతన్ ఆలపించిన స్వాగత గీతంతో ప్రారంభమై, అగ్రాకు చెందిన కాజోల్ నృత్య అకాడమీ కళాకారుల నృత్య ప్రదర్శనతో ఆకట్టుకుంది.
ముంబై నుంచి విచ్చేసిన మీడియా విభాగ జాతీయ సమన్వయకర్త బీకే నికుంజ్ మాట్లాడుతూ, ప్రపంచ శాంతి స్థాపనలో మీడియా పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు. ప్రతి వ్యక్తి తనను తాను మీడియాగా భావించి బాధ్యతతో వ్యవహరించాలన్నారు. చిన్న చిచ్చు అగ్నిని రగిలించినట్లే, శాంతి చిచ్చు ప్రపంచాన్ని మారుస్తుందని, మనం చెప్పే ప్రతి మాట సమాజంపై గొప్ప ప్రభావం చూపుతుందని వివరించారు.
హైదరాబాద్ నుంచి వచ్చిన మీడియా విభాగ ఉపాధ్యక్షురాలు బీకే సర్లా దీది మాట్లాడుతూ, ప్రతి ఆత్మకు శాంతి అవసరమని, సమాజానికి సరైన దారి చూపే బాధ్యత మీడియా వర్గాలపై ఉందని తెలిపారు. రాజయోగ సాధన ద్వారా మనలోని ఆత్మీయ శక్తిని పెంపొందించుకోవాలని సూచించారు.
జ్ఞాన సరోవర్ డైరెక్టర్ రాజయోగిని బీకే ప్రభా దీది ఆశీర్వచనాలు అందిస్తూ, శాంతి మన సహజ స్వభావమని పేర్కొన్నారు. మన జీవితం శాంతితో నిండినప్పుడు మాత్రమే ప్రపంచంలో శాంతి స్థిరపడుతుందని తెలిపారు.
మీడియా విభాగ జాతీయ సమన్వయకర్త బీకే శాంతను భాయ్ సదస్సు కార్యక్రమాలపై సమగ్ర వివరాలు అందించగా, డాక్టర్ బీకే బిన్నీ దీది రాజయోగ ధ్యానం ద్వారా పాల్గొన్న వారికి శాంతి అనుభూతి కల్పించారు. కార్యక్రమం అనంతరం పాల్గొన్న వారికి ప్రసాదం పంపిణీ చేశారు. ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన ప్రభావతి అక్కయ్య ,వెంకట్ పెద్దపుట్టేడు, శ్రీనివాసులు రెడ్డి ఫుల్ టైమ్ అన్నయలు చాలా సహకారం అందించారు.విజయవాడ సెంటర్ హెడ్ పద్మావతి అక్కయ్య గారు 15 మంది జర్నలిస్టులను మౌంట్ అబూ నేషనల్ కాన్ఫరెన్స్ కు పంపడం జరిగింది




