రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు కమిషనర్ వై.ఓ నందన్ నేతృత్వంలో నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలోని అన్ని మున్సిపల్ ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలు, కళాశాలల్లో శుక్రవారం నాడు “మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ 4.0” కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
స్థానిక వెంకటేశ్వరపురం మున్సిపల్ కార్పొరేషన్ పాఠశాలలో నిర్వహించిన పేరెంట్ టీచర్స్ ఆత్మీయ సమావేశానికి నెల్లూరు నగరపాలక సంస్థ గౌరవ మేయర్ దేవరకొండ సుజాత అశోక్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా వ్యవస్థను తీర్చిదిద్దేందుకు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, విద్యాశాఖ మంత్రి వర్యులు ఉన్నత ఆలోచనలతో రూపొందించి అమలు చేస్తున్న పేరెంట్ టీచర్స్ మీటింగ్ 4.0 కార్యక్రమంలో విద్యార్థులను, వారి తల్లిదండ్రులను భాగస్వామ్యం చేస్తూ నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలోని మున్సిపల్ పాఠశాలలో చేపడుతున్న సమావేశాలు అత్యంత ఆదర్శనీయంగా నిలుస్తాయని తెలిపారు.
చిన్నారుల నడవడికను క్రమం తప్పకుండా తల్లిదండ్రులు పరిశీలిస్తూ వారికి అవసరమైన మార్గ నిర్దేశం చేసి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలని మేయర్ ఆకాంక్షించారు.
చిన్నారులకు విద్యతోపాటు శారీరక మానసిక ఆరోగ్యాల కోసం అన్ని పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రణాళిక బద్ధంగా అమలు చేయడం ద్వారా చిన్నారులకు ఉజ్వల భవిష్యత్తును అందించేందుకు దోహదపడుతుందని ప్రకటించారు.
ఈ సమావేశంలో నెల్లూరు నగరపాలక సంస్థ కోఆప్షన్ సభ్యులు షేక్ జమీర్, క్లస్టర్ ఇంచార్జ్ షేక్ జహీర్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు, సిబ్బంది పాల్గొన్నారు.


