ప్రపంచ మానవాళిని ప్రభావితం చేసే భాషా శాస్త్రానికి మూలం పాణిని మహర్షి రచించిన అష్టాధ్యాయి గ్రంథమని పోతన సాహిత్య పీఠం అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి శంకర్ అన్నారు.
న్యూఢిల్లీ కేంద్ర సంస్కృత విశ్వవిద్యాలయం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగు మరియు సంస్కృత అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం కడప నగరం హౌసింగ్ బోర్డు కాలనీలోని శ్రీరామాలయంలో నిర్వహించిన సంస్కృత సప్తాహ మహోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
1927 సంవత్సరంలో ఆంగ్లేయులు మన దేశంలో చేపట్టిన లింగ్విస్టిక్ సర్వే నివేదికలోని 527వ పేజీలో తెలుగు భాషకు సంబంధించిన శాసనాలు అశోకుని పాలన నాటికే ఉన్నట్లు పేర్కొన్నారని డాక్టర్ శంకర్ తెలిపారు. పరమేశ్వరుని డమరుకం నుంచి వెలువడిన 14 శివసూత్రాలే నేటి భాషా శబ్దాలకు మూలమని పేర్కొన్నారు.
విశిష్ట అతిథిగా పాల్గొన్న చిన్మయ మిషన్ జిల్లా అధ్యక్షులు తురియానంద స్వామి మాట్లాడుతూ తెలుగుతో పాటు సంస్కృత భాషను కూడా ప్రతి ఒక్కరూ అభ్యసించాల్సిన అవసరం ఉందన్నారు.
మొల్ల సాహిత్య పీఠం అధ్యక్షులు గానుగపెంట హనుమంతరావు మాట్లాడుతూ తెలుగు భాష అభివృద్ధికి ప్రభుత్వం మరింత సహకారం అందించాలని కోరారు.
సమావేశానికి డాక్టర్ నాగేంద్రమ్మ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా జిల్లా రచయితల సంఘం కార్యదర్శి జింకా సుబ్రహ్మణ్యం, రంగాచార్యులు, శ్యామలనంద ప్రసాద్, శ్యాంప్రసాద్, వెంకటరెడ్డి, సంతోష్ తదితరులు ప్రసంగించారు.
సంస్కృత భాషకు విశేష సేవలు అందించిన నాగమునిరెడ్డి, చెన్నారాయలును ఘనంగా సన్మానించారు. తొలుత జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం అతిథులందరినీ ఘనంగా సన్మానించారు. మధ్యమధ్యలో చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు, భక్తిగీతాలు ఆకట్టుకున్నాయి.



