ఎల్బీనగర్: కర్మాన్ఘాట్ మైత్రిపురం కాలనీలోని భరోసా న్యూరో సైకియాట్రీ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో వినాయక చవితి సందర్భంగా బుధవారం అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. హాస్పిటల్ ప్రాంగణంలో మధ్యాహ్నం 12:30 నుంచి 4 గంటల వరకు జరిగిన ఈ కార్యక్రమంలో 1000 మందికి పైగా భక్తులు పాల్గొని అన్నప్రసాదాలు స్వీకరించారు.
కార్యక్రమానికి ప్రముఖ రాజకీయ నాయకుడు, సామాజిక కార్యకర్త మొగుళ్లపల్లి ఉపేందర్ గుప్తా ముఖ్య అతిథిగా హాజరై వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. భరోసా న్యూరో సైకియాట్రీ హాస్పిటల్స్ వ్యవస్థాపకులు, ముఖ్య కార్యనిర్వహణాధికారి డాక్టర్ ఉదయ్ కిరణ్ మాట్లాడుతూ.. మానసిక ఆరోగ్యంతో మెరుగైన సమాజాన్ని నిర్మించడమే తమ లక్ష్యమన్నారు. సేవా కార్యక్రమాల్లో భాగంగా అన్నదానం నిర్వహిస్తున్నామని, సేవ చేయడంలోనే నిజమైన తృప్తి ఉందని తెలిపారు. హాస్పిటల్లో మానసిక ఆరోగ్యం, నరాల సంబంధిత సమస్యలకు నిపుణుల ఆధ్వర్యంలో వైద్య సేవలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. వ్యసన విముక్తి, కుంగుబాటు, స్కిజోఫ్రేనియా, ఆందోళన, భయాలు, నిద్ర సమస్యలు, మూర్ఛ, జ్ఞాపకశక్తి లోపాలు తదితర సమస్యలకు చికిత్స అందిస్తున్నట్లు వివరించారు. కార్యక్రమంలో హాస్పిటల్ డైరెక్టర్ సి. గోవర్ధన్ రెడ్డి, హాస్పిటల్ సిబ్బంది, స్థానిక నాయకులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.



