బోనకల్ విలేకరులపై దాడికి టీడబ్ల్యూజేఎఫ్ ఖండన
ఖమ్మం జిల్లా పున్నమి ప్రతినిధి గుగులోత్ భావుసింగ్ నాయక్
ఖమ్మం :
తమకు వ్యతిరేకంగా వార్తలు రాసిన బోనకల్ విలేకరులపై భౌతికదాడులకు పాల్పడిన దుండగులపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్- హెచ్ 2843) ఖమ్మం జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. నిరాధార వార్తలు రాస్తే కేసులు పెట్టుకోవచ్చని, చట్టపరంగా చర్యలు తీసుకోవచ్చని…అంతేకానీ దాడులకు పాల్పడటం సరికాదని టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సయ్యద్ ఖదీర్, కొత్తపల్లి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. విలేకరులు తేనె వెంకటేశ్వర్లు (నవతెలంగాణ), తేరాల రఘుపతి (ప్రజాపక్షం), మందా సత్యానందం (విజన్ ఆంధ్ర)పై జరిగిన దాడిని ఆదివారం ఓ ప్రకటనలో ఖండించారు. విలేకరులపై దాడికి పాల్పడిన కేసులో నిందితులు పిల్లి రాహుల్, పాకాలపాటి మోహన్ రాయ్, మరికొందరిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దాడులకు పాల్పడిన సంబంధిత వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించాలని కోరారు. ఇలాంటి రౌడీమూకలపై చట్టపరంగా చర్యలు తీసుకోకపోతే ప్రజాస్వామ్య పద్దతిలో నిరసనలు చేపడతామని హెచ్చరించారు.


