సీతారామపురం, పున్నమి ప్రతినిధి ఆగస్టు 23న
శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా, ఉదయగిరి నియోజకవర్గం లోని సీతారామపురం మండలం లోని బసినేనిపల్లిలో కూటమి ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు సంకల్పంతో చేపట్టిన పి4 కార్యక్రమ స్ఫూర్తితో జనసేన నాయకులు డాll శ్రీ బొగ్గవరపు శ్రీహర్ష ఆధ్వర్యంలో సీతారామపురం మండలం, బసినేనిపల్లి గ్రామంలోని హైస్కూల్ ప్రాంగణంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ ఉచిత మెగా వైద్య శిబిరం ప్రారంభోత్సవ కార్యక్రమానికి గౌరవ ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ , గౌరవ మాజీ ఎమ్మెల్యే శ్రీ కంభం విజయరామిరెడ్డి , జనసేన పార్టీ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి కొట్టే వెంకటేశ్వర్లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు రిబ్బన్ కట్ చేసి వైద్య శిబిరాన్ని లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం శిబిరంలో ఏర్పాటు చేసిన వివిధ వైద్య విభాగాలను పరిశీలించి, వైద్య సేవలందిస్తున్న వైద్యులతో మాట్లాడి ప్రజలకు అందుతున్న సేవల వివరాలను తెలుసుకున్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లోని పేద, మధ్యతరగతి ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించడం అభినంద నీయమన్నారు. ఆరోగ్యంపై ప్రజల్లో అవగాహన పెంచడంతో పాటు, వ్యాధులను ప్రారంభ దశలోనే గుర్తించి తగిన వైద్యం అందించడం ద్వారా అనేక ఆరోగ్య సమస్యలను నివారించ వచ్చన్నారు. పి4 కార్యక్రమం లక్ష్యాలకు అనుగుణంగా సమాజంలోని ప్రతి వర్గానికి అండగా నిలవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు.ఈ మెగా ఉచిత వైద్య శిబిరంలో స్త్రీల వైద్య విభాగం (గైనకాలజీ), దంత వైద్య విభాగం, నేత్ర వైద్య విభాగం (ఆప్తమాలజీ), జనరల్ మెడిసిన్, ఎముకలు–కీళ్ల వైద్య విభాగం (ఆర్థోపెడిక్స్), చిన్నపిల్లల వైద్య విభాగం (పీడియాట్రిక్స్) తదితర విభాగాల్లో ప్రత్యేక వైద్య సేవలు అందించారు. వైద్యులు డాllక్రాంతి, డాll హజరత్ కుమార్, డాll నవీన్, డాll కాసిఫా తదితరులు పాల్గొని గ్రామ ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించి, వారి ఆరోగ్య పరిస్థితులను పరిశీలించారు. అవసరమైన వారికి వ్యాధులపై అవగాహన కల్పించి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆహారపు అలవాట్లు, ఆరోగ్య పరిరక్షణకు సంబంధించిన పలు సూచనలు అందించారు. అదేవిధంగా వైద్య శిబిరానికి హాజరైన ప్రజలకు అవసరమైన మందులను ఉచితంగా పంపిణీ చేశారు. వివిధ ఆరోగ్య సమస్యలకు సంబంధించి ప్రాథమిక పరీక్షలు నిర్వహించడంతో పాటు, అవసరమైన వారికి తదుపరి వైద్య చికిత్సపై కూడా తగిన సలహాలు అందించారు. ఈ కార్యక్రమంలో మండల కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.





