సత్తుపల్లి / ఖమ్మం
గణేష్ నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని కల్లూరు ఏసీపీ వసుంధర యాదవ్ సూచించారు. సత్తుపల్లిలోని ఏసీపీ కార్యాలయంలో గణేష్ మండపాల నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సైబర్ నేరాల అవగాహన పోస్టర్లు, పాయింట్ బుక్స్ను నిర్వాహకులకు అందజేశారు. మండపాల వివరాలను పోలీసు శాఖ పోర్టల్లో ఆన్లైన్లో నమోదు చేసుకోవాలని సూచించారు. మండపాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, విద్యుత్ వైరింగ్ను నిపుణులతో తనిఖీ చేయించాలన్నారు. అగ్నిమాపక పరికరాలు, అత్యవసర మార్గాలు అందుబాటులో ఉంచాలని తెలిపారు. రద్దీ, పార్కింగ్, ట్రాఫిక్ నియంత్రణకు ఏర్పాట్లు చేసుకోవాలని, డీజేలు, సౌండ్ సిస్టమ్ల విషయంలో నిబంధనలు పాటించాలని స్పష్టం చేశారు. ఊరేగింపు, నిమజ్జనం సమయంలో పోలీసులతో సమన్వయం చేసుకోవాలని, చిన్నారులు, ఈత రాని వారు నీటిలోకి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఏసీపీ వసుంధర యాదవ్ కోరారు.



