ఖమ్మం జిల్లా ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యలు జిల్లా కలెక్టర్కు వినతిపత్రాలు అందజేశారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికలో పూర్తి పారదర్శకత పాటించి, అధికారిక గ్రామసభల ద్వారా అర్హులను ఎంపిక చేయాలని కోరారు. తల్లాడ మండలంలోని సిరిపురం మేజర్ కాలువ పనులను త్వరితగతిన పూర్తి చేసి సుమారు 11 వేల ఎకరాలకు సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పెనుబల్లి మండలంలోని రాతోని, తాళ్లపెంట ఎత్తిపోతల పథకాలకు అవసరమైన ట్రాన్స్ఫార్మర్లను తక్షణమే ఏర్పాటు చేసి రైతుల పంటలను కాపాడాలని కోరారు. అలాగే జింకలతండాలో ఈద్గా, ఖబరస్థాన్ స్థల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని అధికారులను కోరారు. జిల్లాలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి, త్వరితగతిన పరిష్కార చర్యలు చేపట్టాలని బీఆర్ఎస్ నేతలు విజ్ఞప్తి చేశారు.



