56 మంది లబ్ధిదారులకు రూ.46 లక్షల చెక్కులు పంపిణీ
అనపర్తి, సెప్టెంబరు10 (పున్నమి ప్రతినిధి): ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) ద్వారా అనారోగ్యంతో బాధపడుతున్న పేద, ఆపన్న కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. అనపర్తి మండలం రామవరంలో గురువారం నియోజకవర్గానికి చెందిన 56 మంది లబ్ధిదారులకు వైద్య చికిత్స కోసం రూ.46 లక్షల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అనారోగ్య సమస్యలతో చికిత్స పొందుతూ ఎన్టీఆర్ వైద్య సేవల పరిధిలోకి రాని పేషెంట్లకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు తెలిపారు. వైద్య ఖర్చులను భరించలేని కుటుంబాలకు ఈ పథకం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు.
అనపర్తి నియోజకవర్గంలో ఇప్పటివరకు 524 మంది లబ్ధిదారులకు మొత్తం రూ.4.68 కోట్ల మేర ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక సహాయం అందించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా కూడా గత రెండు సంవత్సరాల్లో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా భారీగా ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు పేర్కొన్నారు.
లబ్ధిదారులకు అందుతున్న సహాయం సక్రమంగా వినియోగపడేలా సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వైద్య చికిత్సకు సంబంధించిన అంచనా వ్యయాలు వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా ఉండాలని, అర్హులైన వారికి అవసరమైన మేరకు సహాయం అందేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.
ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అందుతున్న ఆర్థిక సహాయం అనేక కుటుంబాలకు క్లిష్ట సమయంలో ఎంతో ఊరటనిస్తోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.





