ఖమ్మం జూన్
(పువ్వాడ నాగేంద్ర కుమార్
పున్నమి జిల్లా రిపోర్టర్)
పాలేరు నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న కల్వకుంట్ల తారక రామ రావు (కేటీఆర్) రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వంపై, ముఖ్యంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.
రాష్ట్రంలో రెవెన్యూ ఆదాయం తగ్గుతున్నప్పటికీ రెవెన్యూ శాఖకు సంబంధించిన అవినీతి వ్యవహారాలు పెరిగిపోయాయని ఆరోపించిన కేటీఆర్, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అక్రమ సంపాదన, భూ వ్యవహారాలు, ఇసుక దందాలు, సెటిల్మెంట్లలో పాల్గొంటున్నారని ఆరోపించారు. గతంలో ఈడీ దాడుల్లో వందల కోట్ల రూపాయలు బయటపడినా ఆ అంశంపై బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు స్పందించలేదని విమర్శించారు.
భూముల వివాదాల పేరుతో రైతులను ఇబ్బందులకు గురిచేస్తూ, భారీ స్థాయిలో సెటిల్మెంట్లు జరుగుతున్నాయని ఆరోపించిన ఆయన, వట్టినాగులపల్లి భూముల వ్యవహారంలో మంత్రి కుటుంబ సభ్యుల పాత్రపై కూడా ప్రశ్నలు లేవనెత్తారు. అక్రమ మైనింగ్, ఇసుక వ్యాపారాల ద్వారా వేల కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారని ఆరోపించారు.
ఇందిరమ్మ ఇళ్ల అంశంపై మంత్రి పొంగులేటి విసిరిన సవాల్కు స్పందిస్తూ, హౌసింగ్ మంత్రి హోదాలో 20 లక్షల ఇళ్లు నిర్మిస్తానని చెప్పిన మాటను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. రెండేళ్లు పూర్తవుతున్నా 10 లక్షల ఇళ్లు కూడా నిర్మించలేదని విమర్శించారు. ఖమ్మం జిల్లాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు ఎన్ని ఇళ్లు కేటాయించారో ప్రజలకు చెప్పాలని కోరారు.
రాష్ట్ర ప్రభుత్వం రైతులపై మళ్లీ భూమి శిస్తు భారం మోపేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించిన కేటీఆర్, గతంలో కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రభుత్వం రద్దు చేసిన భూమి శిస్తును కాంగ్రెస్ ప్రభుత్వం తిరిగి తీసుకురావాలని చూస్తోందని అన్నారు.
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అహంకారపూరితంగా వ్యవహరిస్తున్నారని, తోటి మంత్రులు, అధికారులతో అనుచితంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. ప్రజలు అన్నింటినీ గమనిస్తున్నారని, పాలేరు నియోజకవర్గంలో భవిష్యత్తులో కూడా గులాబీ జెండా ఎగురుతుందని ధీమా వ్యక్తం చేశారు.
ఈ సమావేశంలో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మాజీ ఎమ్మెల్యే కందల ఉపేందర్ రెడ్డి రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర ఎమ్మెల్సీలు తాతా మధుసూదన్, తక్కెళ్లపల్లి రవీందర్ రావు, ఖమ్మం కార్పొరేషన్ మాజీ డిప్యుటీ మేయర్ బత్తుల మురళి, ఖమ్మం నగర అధ్యక్షులు పగడల నాగరాజు, కూరాకుల నాగభూషణం, తదితరులు పాల్గొన్నారు.



