ఖమ్మం, జూన్
(పువ్వాడ నాగేంద్ర కుమార్
పున్నమి జిల్లా రిపోర్టర్ )
కేంద్ర ఎన్నికల సంఘం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) సర్వే నేటి నుంచి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఖమ్మం జిల్లాలోని ప్రతి ఇంటిని సందర్శించి ఓటర్ల వివరాలను సేకరించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.
జిల్లాలో సుమారు 12.45 లక్షల మంది ఓటర్లు ఉండగా, వారి వివరాల ధృవీకరణ కోసం 1,460 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అలాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 9.66 లక్షల మంది ఓటర్లకు సంబంధించి 1,000 పోలింగ్ బూత్లు అందుబాటులో ఉన్నాయి.
ఈ సర్వే నిర్వహణకు 2,002 మంది బూత్ లెవల్ అధికారులు (BLOలు) ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వివరాలను సేకరించనున్నారు. ఓటర్ల జాబితా ప్రక్షాళన, అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించడం, తప్పుల సవరణ వంటి లక్ష్యాలతో ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని ఎన్నికల సంఘం చేపట్టింది.
సర్వే సందర్భంగా ప్రజలు అవసరమైన పత్రాలు, వివరాలను సిద్ధంగా ఉంచి BLOలకు సహకరించాలని అధికారులు కోరారు.



