(జయప్రతాప్ రెడ్డి నెల్లూరు బ్యూరో)
ఆంధ్రప్రదేశ్లోని ప్రత్యేక ఆర్థిక మండలాల (Special Economic Zones – SEZs) ప్రస్తుత పరిస్థితి, ముఖ్యంగా నెల్లూరు జిల్లాలోని ఎస్ఈజెడ్ల అభివృద్ధి, పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు, మౌలిక సదుపాయాల పురోగతి తదితర అంశాలపై రాజ్యసభలో అడిగిన తన ప్రశ్నకు కేంద్ర వాణిజ్య మరియు పరిశ్రమల శాఖ మంత్రి సమగ్ర సమాధానం ఇచ్చినట్లు రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్ రావు యాదవ్ తెలిపారు.
కేంద్ర ప్రభుత్వ సమాధానం ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం 36 ప్రత్యేక ఆర్థిక మండలాలకు (ఎస్ఈజెడ్లు) అధికారిక అనుమతులు లభించగా, వాటిలో 31 ఎస్ఈజెడ్లు నోటిఫై చేయబడి, 25 ఎస్ఈజెడ్లు ప్రస్తుతం కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. 2026 మార్చి 31 నాటికి ఈ ఎస్ఈజెడ్లలో 2,942.18 హెక్టార్ల భూమి వినియోగంలోకి రావడంతో పాటు రూ.48,144 కోట్ల పెట్టుబడులు ఆకర్షించబడి, 79,523 మందికి ఉపాధి కల్పించబడినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.
అలాగే నెల్లూరు జిల్లాలో 7 ఎస్ఈజెడ్లకు అధికారిక అనుమతులు లభించగా, వాటిలో 6 నోటిఫై చేయబడి, 5 ఎస్ఈజెడ్లు ప్రస్తుతం కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. ఈ ఐదు ఎస్ఈజెడ్ల ద్వారా ఇప్పటికే రూ.12,147 కోట్ల పెట్టుబడులు జిల్లాకు వచ్చినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.
ఈ సందర్భంగా బీద మస్తాన్ రావు యాదవ్ మాట్లాడుతూ, నెల్లూరు జిల్లా పరిశ్రమలు, ఎగుమతులు మరియు ఉపాధి కల్పనకు రాష్ట్రంలోనే అత్యంత అనుకూలమైన జిల్లాల్లో ఒకటిగా ఎదుగుతోందన్నారు. కృష్ణపట్నం పోర్టు, జాతీయ రహదారులు, రైల్వే అనుసంధానం, చెన్నై-బెంగళూరు పారిశ్రామిక కారిడార్కు సమీపంలో ఉండటం వల్ల నెల్లూరుకు భారీ పెట్టుబడులు ఆకర్షించే సామర్థ్యం ఉందని పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వం ఎస్ఈజెడ్లకు అవసరమైన అనుమతులను బోర్డ్ ఆఫ్ అప్రూవల్ ద్వారా వేగవంతంగా మంజూరు చేయడంతో పాటు సింగిల్ విండో విధానంలో అనుమతుల ప్రక్రియను సులభతరం చేస్తున్నట్లు సమాధానంలో తెలిపిందన్నారు. అలాగే సెమీకండక్టర్, ఎలక్ట్రానిక్స్ తయారీ ఎస్ఈజెడ్ల కోసం కనీస భూ అవసరాన్ని 50 హెక్టార్ల నుంచి 10 హెక్టార్లకు తగ్గిస్తూ ఎస్ఈజెడ్ నిబంధనల్లో చేసిన సవరణలు దేశవ్యాప్తంగా కొత్త పెట్టుబడులకు మార్గం సుగమం చేశాయని వివరించారు.
ఈ అవకాశాలను వినియోగించుకొని నెల్లూరు జిల్లాలో సెమీకండక్టర్, ఎలక్ట్రానిక్స్, పునరుత్పాదక ఇంధనం, ఆహార ప్రాసెసింగ్, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు, ఎగుమతి ఆధారిత తయారీ యూనిట్లను పెద్ద ఎత్తున స్థాపించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరియు ఎస్ఈజెడ్ అభివృద్ధి సంస్థలు సమన్వయంతో ముందుకు రావాలని బీద మస్తాన్ రావు యాదవ్ కోరారు.
మిగిలిన ఆమోదం పొందిన ఎస్ఈజెడ్లను కూడా త్వరితగతిన పూర్తిస్థాయిలో కార్యాచరణలోకి తీసుకురావడం, అవసరమైన మౌలిక వసతులను వేగంగా పూర్తి చేయడం, పెట్టుబడిదారులకు అనుకూల వాతావరణం కల్పించడం ద్వారా నెల్లూరు జిల్లాను దేశంలో ప్రముఖ పారిశ్రామిక, ఎగుమతి కేంద్రంగా తీర్చిదిద్దాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
*-శ్ర


