నెల్లూరు జిల్లాలో మహిళలు, విద్యార్థినుల ఆత్మహత్యల నివారణపై ప్రభుత్వం ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించింది.
నెల్లూరు జిల్లా , మహిళల ఆత్మహత్యల నివారణకు ప్రభుత్వం చేపడుతున్న అవగాహన కార్యక్రమాల్లో భాగంగా పొదలకూరు రోడ్డు పరిధిలోని, డీసీఆర్ జడ్పీ బాలుర ఉన్నత పాఠశాల మరియు జడ్పీ బాలికల ఉన్నత పాఠశాలల్లో విద్యార్థులు, విద్యార్థినులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఐసీడీఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ బి. హేనా సుజన్ ఆదేశాల మేరకు, జిల్లా బాలల సంరక్షణ అధికారి బి. సురేష్ సూచనలతో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా డీసీఆర్ జడ్పీ బాలుర పాఠశాల ప్రధానోపాధ్యాయులు పీవీ కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. బాలికలు జీవితంలో ఎదురయ్యే సమస్యలను ధైర్యంగా ఎదుర్కోవాలని, ఎలాంటి పరిస్థితుల్లోనూ ఆత్మవిశ్వాసం కోల్పోరాదని సూచించారు.జిల్లా బాలల సంరక్షణ విభాగానికి చెందిన సిహెచ్ సమత మాట్లాడుతూ… ప్రస్తుత యాంత్రిక జీవనంలో ఒత్తిడి, ఆందోళన, నిరాశ, ఆర్థిక ఇబ్బందులు వంటి కారణాలతో మహిళలు, యువత మానసికంగా కుంగిపోతున్నారని తెలిపారు. ప్రతికూల ఆలోచనలను దూరం చేసుకుని, జీవిత లక్ష్యాలను నిర్దేశించుకుని వాటి సాధన కోసం కృషి చేయాలని సూచించారు. ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుందని, కుటుంబ పరిస్థితులు లేదా ఇతర ఇబ్బందులు ఉన్నత లక్ష్యాలను సాధించడంలో అడ్డంకులు కావని పేర్కొన్నారు. జడ్పీ బాలికల ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు జ్యోతిర్మయి మాట్లాడుతూ.. పిల్లలు ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నా వెంటనే 1098 చైల్డ్ హెల్ప్ లైన్ ను సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు పీవీ కృష్ణారెడ్డి, జ్యోతిర్మయి, ఐసీపీఎస్ సిబ్బంది సిహెచ్ సమత, కౌన్సిలర్ బి. జోస్నా, ఓఎస్సీ కౌన్సిలర్ కమల తదితరులు పాల్గొన్నారు.


