పొలమూరులో కూటమి ఆత్మీయ సమ్మేళనం.. మనోజ్ జిందాబాద్ నినాదాలతో మారుమోగిన సభాప్రాంగణం
పొలమూరు, జూలై 27 (రమేష్ నాయుడు – పున్నమి ప్రతినిధి):
అనపర్తి నియోజకవర్గం టీడీపీ ఇంచార్జ్గా నల్లమిల్లి మనోజ్ రెడ్డి నియమితులైన సందర్భంగా పొలమూరులోని ఎస్వీఆర్ ఫంక్షన్ హాల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి శ్రేణుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం ఘనంగా నిర్వహించారు. నల్లమిల్లి కుటుంబంలో మూడో తరం వారసుడిగా రాజకీయ బాధ్యతలు చేపట్టిన మనోజ్ రెడ్డికి కూటమి నాయకులు, కార్యకర్తలు ఘనంగా అభినందనలు తెలిపారు.
కార్యక్రమం ప్రారంభంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు, స్వర్గీయ నల్లమిల్లి మూలారెడ్డి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలుగుదేశం పార్టీకి నల్లమిల్లి మూలారెడ్డి అందించిన సేవలను ఈ సందర్భంగా పలువురు నాయకులు కొనియాడారు. ఆయన అనంతరం అనపర్తి నియోజకవర్గ టీడీపీ శ్రేణులకు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అండగా నిలిచి పార్టీని బలోపేతం చేసిన తీరును ప్రశంసించారు.
జిల్లా నుంచి పలువురు ఎమ్మెల్యేలు, కూటమి ముఖ్య నాయకులు కార్యక్రమానికి హాజరై మనోజ్ రెడ్డికి అభినందనలు తెలిపారు. నల్లమిల్లి కుటుంబానికి అనపర్తి నియోజకవర్గంతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్న నాయకులు.. తాత, తండ్రి సాధించిన ఘన కీర్తి, విశ్వసనీయతను మరింత ముందుకు తీసుకెళ్లాలని మనోజ్ రెడ్డికి సూచించారు.
నియోజకవర్గంలోని నాలుగు మండలాల నుంచి టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో సభా ప్రాంగణం సందడిగా మారింది. మనోజ్ రెడ్డి జిందాబాద్ అంటూ కూటమి శ్రేణులు చేసిన నినాదాలతో ప్రాంగణం మారుమోగింది.
ఈ సందర్భంగా నల్లమిల్లి మనోజ్ రెడ్డి మాట్లాడుతూ.. పార్టీ తనపై ఉంచిన నమ్మకాన్ని కాపాడుతూ, కూటమి నాయకులు, కార్యకర్తల సమన్వయంతో అనపర్తి నియోజకవర్గంలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తానన్నారు. తన తాత స్వర్గీయ నల్లమిల్లి మూలారెడ్డి, తండ్రి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సాధించిన కీర్తి ప్రతిష్టలను మరింత పెంచే దిశగా పనిచేస్తానని తెలిపారు.
కూటమి ప్రభుత్వ లక్ష్యాలు, ప్రజా సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణుల మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేస్తానని మనోజ్ రెడ్డి పేర్కొన్నారు. తనకు అందించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తించి పార్టీకి, నియోజకవర్గ ప్రజలకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు.
కార్యక్రమంలో కూటమి నాయకులు, నాలుగు మండలాల పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




