నందలూరు మండల కేంద్రంలోని బ్రాహ్మణ వీధిలో డీజే గణేష్ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ ఏడాది డీజే గణేష్ కమిటీ యువకులు ఏర్పాటు చేసిన విఘ్నేశ్వరుడి ప్రతిమ భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది.
రైతు రూపంలో సరికొత్త అవతారం
ఉమ్మడి కడప జిల్లాలోనే వినూత్నంగా, బొజ్జ గణపయ్య ఎద్దుల బండి తోలుతున్న రైతు రూపంలో దర్శనమిస్తున్నాడు. రైతు బాంధవుడిగా నేల వైపు కరుణతో చూస్తూ భక్తులను అనుగ్రహిస్తున్న స్వామివారి రూపం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ విగ్రహాన్ని చూసేందుకు స్థానికులు, భక్తులు ఆసక్తి చూపుతున్నారు.
ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ.. “కడప సీమలోని కష్టాలన్నీ తొలగి, వర్షాలు సమృద్ధిగా కురిసి, పంటలు బాగా పండాలని ఆ గణనాథుడిని ప్రార్థిస్తూ ఈ వినూత్న రూపాన్ని రూపొందించాం” అని తెలిపారు.
పెద్ద ఎత్తున పాల్గొన్న భక్తులు
పండుగ సందర్భంగా బ్రాహ్మణ వీధిలో ప్రత్యేక పూజా కార్యక్రమాలను శ్రద్ధాభక్తులతో నిర్వహించారు. పూజల్లో స్థానిక భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.
వినూత్నంగా రూపొందించిన ఎద్దుల బండిని తోలుతున్న గణపతి విగ్రహంతో ఫొటోలు, సెల్ఫీలు దిగేందుకు భక్తులు, యువకులు ఆసక్తి చూపారు. వేడుకల్లో భాగంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లు చేశారు.


