తిరుచానూరు, ఆగస్టు 7 పున్నమి ప్రతినిధి
తిరుపతి గ్రామీణ మండలంలోని, తిరుచానూరు గ్రామపంచాయతీలో 2026-27 సంవత్సరానికి వివిధ వస్తువులు, సేవల సరఫరా కోసం ఆహ్వానించిన సీల్డ్ టెండర్లకు స్పందన కరువైంది. టెండర్లకు ఎవరూ స్పందించకపోవడంతో మరోసారి టెండర్లు నిర్వహించనున్నట్లు పంచాయతీ ఇంచార్జ్ కార్యదర్శి, డిప్యూటీ ఎంపీడీవో దయాసాగర్ ఒక ప్రకటనలో తెలిపారు. శుక్రవారం నిర్వహించిన టెండర్లలో ఎవరూ పాల్గొనకపోవడంతో తదుపరి టెండర్లను ఈ నెల 14వ తేదీకి వాయిదా వేసినట్లు పేర్కొన్నారు. గ్రామపంచాయతీకి అవసరమైన ప్రజారోగ్య, రక్షిత మంచినీటి సరఫరా పరికరాలు, స్టేషనరీ, నీటి సరఫరా మోటర్లు, స్టార్టర్లు, రివైండింగ్, మరమ్మతు పనులతో పాటు సిబ్బందికి యూనిఫామ్, చెప్పులు, నూనె, సబ్బుల సరఫరా కోసం టెండర్లు నిర్వహించనున్నట్లు తెలిపారు. వీధిదీపాల విద్యుత్ పరికరాలు, జేసీబీ ద్వారా పారిశుద్ధ్య పనులు, అత్యవసర అవసరాల కోసం ట్రాక్టర్ ఏర్పాటు తదితర పనులు కూడా టెండర్ల పరిధిలో ఉన్నాయని వెల్లడించారు. ఆసక్తి గల అభ్యర్థులు పూర్తి వివరాల కోసం గ్రామపంచాయతీ కార్యాలయాన్ని పని దినాలలో సంప్రదించాలని దయాసాగర్ సూచించారు.


