టంగుటూరులో ఘనంగా చుండూరు అమర వీరులు, గద్దర్ సంస్మరణ సభ
సామాజిక న్యాయం, రాజ్యాంగ పరిరక్షణకు ఐక్యంగా పోరాడాలని నాయకుల పిలుపు
టంగుటూరు, ఆగస్టు 6: చుండూరు అమర వీరులు మరియు ప్రజా గాయకుడు గద్దర్ సంస్మరణ సభను టంగుటూరు గ్రామంలోని అంబేద్కర్ నగర్ మెమోరియల్ పార్క్లో గురువారం ఘనంగా నిర్వహించారు. దళిత, బహుజన సంఘాల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి వివిధ సామాజిక, ప్రజా సంఘాల నాయకులు, యువత, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై అమర వీరులకు, గద్దర్కు ఘన నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమానికి విసికె పార్టీ ప్రకాశం జిల్లా అధ్యక్షుడు ఆదినారాయణ అధ్యక్షత వహించగా, ముఖ్య అతిథులుగా విసికె పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు విద్యాసాగర్, రాష్ట్ర మాల ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు తుల్లిబిల్లి అశోక్ బాబు, అడ్వకేట్ జీబీఆర్ అంబేద్కర్, మాలల జేఏసీ అధ్యక్షుడు కొండలరావు పాల్గొన్నారు.
వక్తలు మాట్లాడుతూ చుండూరు మారణకాండ భారతదేశ చరిత్రలో దళితులపై జరిగిన అత్యంత దారుణ సంఘటనల్లో ఒకటిగా నిలిచిందని పేర్కొన్నారు. చుండూరు అమర వీరులు సామాజిక సమానత్వం కోసం చేసిన త్యాగాలను భావితరాలు గుర్తుంచుకోవాలని, వారి ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ప్రజా గాయకుడు గద్దర్ జీవితమంతా అణగారిన వర్గాల హక్కులు, సామాజిక న్యాయం, సమానత్వం కోసం అంకితమైందని కొనియాడారు. ఆయన పాటలు ప్రజల్లో చైతన్యాన్ని నింపాయని, సామాజిక మార్పుకు ఆయుధాలుగా నిలిచాయని పేర్కొన్నారు.
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చూపిన మార్గంలో నడుస్తూ సామాజిక న్యాయం, సమాన హక్కుల కోసం ఐక్యంగా పోరాడాలని నాయకులు పిలుపునిచ్చారు. కుల వివక్ష, సామాజిక అన్యాయాలకు వ్యతిరేకంగా ప్రజలంతా ఒక్కటై రాజ్యాంగ విలువలను కాపాడాలని కోరారు.
కార్యక్రమంలో అమర వీరులకు, గద్దర్కు రెండు నిమిషాల మౌనం పాటించి పుష్పాంజలి ఘటించారు. అనంతరం జై భీమ్ నినాదాలతో సభ ప్రాంగణం మార్మోగింది. ఈ సంస్మరణ సభలో ప్రజలు, యువత, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.



