ఒంగోలు: చుండూరు వర్ధంతి సందర్భంగా దళిత సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఒంగోలు కలెక్టర్ కార్యాలయం సమీపంలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కాంస్య విగ్రహం వద్ద నుంచి హెచ్సీఎం కళాశాల వరకు కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించి చుండూరు అమర వీరులకు ఘన నివాళులు అర్పించారు. అనంతరం వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థనలు నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి దళిత మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు పాలడుగు విజేంద్ర బహుజన్, ఐక్య వేదిక వ్యవస్థాపకుడు డాక్టర్ చప్పిడి వెంగళరావు, జై జనం పార్టీ వ్యవస్థాపకుడు చప్పిడి రవిశంకర్, దళిత కళామండలి కన్వీనర్ చిట్టీమాల సంపత్, దళిత హక్కుల సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు ముప్పవరపు గోపి, జై భీమ్ భారత్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కె.వి. కృష్ణారావు, మాల భేరి జాతీయ యువజన అధ్యక్షుడు డాక్టర్ చప్పిడి ప్రీతం ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
వక్తలు మాట్లాడుతూ చుండూరు మారణకాండ మానవత్వానికి మాయని మచ్చ అని పేర్కొన్నారు. కారంచేడు ఉద్యమం ద్వారా ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం బలోపేతం కావడం, చుండూరు ఉద్యమం ద్వారా గ్రామంలోనే కోర్టు ఏర్పాటు వంటి కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయని గుర్తు చేశారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాల మేరకు సామాజిక న్యాయం, రాజ్యాధికార సాధనే అమర వీరులకు నిజమైన నివాళి అని అభిప్రాయపడ్డారు.
ఈ సందర్భంగా చుండూరు అమర వీరులతో పాటు ప్రజా గాయకుడు గద్దర్కు కూడా ఘన నివాళులు అర్పించారు. కార్యక్రమంలో మాల యువసేన జిల్లా అధ్యక్షుడు కోడెరెక్కల హనుమంతరావు, కార్యదర్శి చిడితోటి శ్రీనివాసరావు, డ్రైవర్స్ యూనియన్ నాయకుడు ఐదుపోగుల అజయ్ బాబు, దళిత బహుజన ఉద్యోగ నాయకుడు తెల్ల మోహనరావు, దళిత మహిళా జిల్లా అధ్యక్షురాలు రాయవరపు సునీత, అంబేద్కర్ యూత్ అధ్యక్షుడు పంది రాజశేఖర్తో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

