*ఖమ్మం కార్పొరేషన్లో అవినీతి, అక్రమాలపై బీఆర్ఎస్ ముట్టడి*
పున్నమి ప్రతినిధి ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్
ఖమ్మం:
మున్సిపల్ కార్పొరేషన్లో జరుగుతున్న అవినీతి, అక్రమాలు, ప్రజా సమస్యలు, పరిపాలనా వైఫల్యాలపై భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ ఆధ్వర్యంలో గురువారం ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయాన్ని ముట్టడించారు. అనంతరం డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్కు వినతిపత్రాన్ని సమర్పించారు.
వినతిపత్రంలో నగర పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా, రోడ్ల మరమ్మతులు, వీధి దీపాల నిర్వహణ, పార్కుల అభివృద్ధి, అక్రమ నిర్మాణాల నియంత్రణ, ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారుల నిర్లక్ష్యంపై తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ మాజీ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు, ఆర్జేసీ కృష్ణ, కర్ణాటి కృష్ణ, బచ్చు విజయ్ కుమార్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఖమ్మం కార్పొరేషన్ అవినీతికి కేంద్రంగా మారిందని ఆరోపించారు.
ఇందిరమ్మ ఇండ్ల మంజూరులో భారీ ఎత్తున అవినీతి జరిగిందని, లంచాలు తీసుకుంటూ పట్టుబడిన అధికారుల వ్యవహారం కార్పొరేషన్లో అవినీతి తీవ్రతకు నిదర్శనమని పేర్కొన్నారు. సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాల్సింది పోయి, కాంగ్రెస్ నాయకులు, అధికారులు కుమ్మక్కై వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఇందిరమ్మ ఇండ్ల పేరుతో పేదల ఆశలను దోచుకుంటున్న వారిపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
మున్సిపల్ కార్పొరేషన్లో డీజిల్ వినియోగంలో కూడా భారీ అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించారు. వినియోగంలో లేని లేదా బ్రేక్డౌన్ అయిన వాహనాల నంబర్లతో అక్రమంగా డీజిల్ తీసుకుంటూ ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగిస్తున్నారని, ఈ వ్యవహారంపై స్వతంత్ర సంస్థతో విచారణ జరిపి బాధ్యులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నగర ప్రజల సౌకర్యార్థం నిర్మించిన పబ్లిక్ టాయిలెట్లు, వాటికి అనుబంధంగా ఏర్పాటు చేసిన షాపింగ్ కాంప్లెక్స్ల నిర్వహణను పారదర్శక టెండర్ విధానంలో అప్పగించామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ విధానాన్ని పక్కనపెట్టి, తమకు అనుకూల వ్యక్తులకు షాపులు కేటాయించడం వల్ల పలు ప్రాంతాల్లో పబ్లిక్ టాయిలెట్లు మూతపడే పరిస్థితి ఏర్పడిందని ఆరోపించారు.
నగరంలో పారిశుద్ధ్య వ్యవస్థ పూర్తిగా దెబ్బతిందని, డ్రైనేజీలు శుభ్రం చేయకపోవడంతో మురుగు నీరు రోడ్లపైకి వస్తోందని, తాగునీటి సమస్యలు, వీధి దీపాలు వెలగకపోవడం, రోడ్ల దుస్థితి, పార్కుల నిర్వహణలో నిర్లక్ష్యం, అక్రమ నిర్మాణాలపై చర్యలు లేకపోవడం వంటి సమస్యలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.
ఖమ్మం కార్పొరేషన్లో జరుగుతున్న ప్రతి అవినీతి, అక్రమంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులైన అధికారులు, ప్రజాప్రతినిధులు ఎవరైనా చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే నగర ప్రజలను సమీకరించి మరింత ఉధృతంగా ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ ఖమర్, బి. రెడ్డి నాగచంద్రారెడ్డి, మాజీ డిప్యూటీ మేయర్ బత్తుల మురళి, మాజీ కార్పొరేటర్లు, మాజీ కౌన్సిలర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

