ఆసిఫాబాద్, జూలై 13: కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని పలు ప్రధాన రహదారులపై వీధి దీపాలు లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాత్రి వేళల్లో చీకటి కారణంగా పాదచారులు, వాహనదారులు, విద్యార్థులు ప్రమాదాలకు గురయ్యే పరిస్థితి నెలకొన్నట్లు స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
జిల్లా గ్రంథాలయం నుంచి పాత కలెక్టరేట్ వరకు, బాలుర ఆశ్రమ పాఠశాల నుంచి థియేటర్ వరకు, థియేటర్ నుంచి సఖి సెంటర్ వరకు, అలాగే ఎస్పీ కార్యాలయం, నూర్నగర్ వరకు వీధి దీపాలు లేకపోవడం వల్ల రాత్రి సమయంలో ప్రయాణం కష్టంగా మారిందని ప్రజలు తెలిపారు. ముఖ్యంగా విద్యార్థులు, మహిళలు, వృద్ధులు చీకట్లో రాకపోకలు సాగించాల్సి వస్తోందని పేర్కొన్నారు.
ఆసిఫాబాద్ కొత్త మున్సిపాలిటీగా ఏర్పడినప్పటికీ ప్రాథమిక సౌకర్యాల కల్పనలో నిర్లక్ష్యం కొనసాగుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రజల భద్రత దృష్ట్యా సంబంధిత అధికారులు వెంటనే స్పందించి దెబ్బతిన్న లేదా లేని వీధి దీపాలను ఏర్పాటు చేసి సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని వారు కోరుతున్నారు.
స్థానిక ప్రజాప్రతినిధులు, మున్సిపల్ అధికారులు ఈ సమస్యపై ప్రత్యేక దృష్టి సారించి జిల్లా కేంద్రంలోని ప్రధాన రహదారులన్నింటిలో తగిన సంఖ్యలో ఎల్ఈడీ వీధి దీపాలను ఏర్పాటు చేయాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.






