కుర్మిద్దా ప్రభుత్వ పాఠశాలలో సైబర్ అవగాహన కార్యక్రమం
విద్యార్థులకు ఆన్లైన్ మోసాలపై పోలీసులు కీలక సూచనలు
పున్నమి న్యూస్ ప్రతినిధి
కుర్మిద్దా, ఆగస్టు 6: సైబర్ జాగృతి దివస్ సందర్భంగా హైదరాబాద్ గ్రీన్ ఫార్మా సిటీ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో గురువారం కుర్మిద్దా ప్రభుత్వ పాఠశాలలో సైబర్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఇన్స్పెక్టర్ శ్రీ బి. సత్యనారాయణ, ఎస్.ఐ. శ్రీ సైదులు పాల్గొని విద్యార్థులకు సైబర్ నేరాలపై సమగ్ర అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్న నేపథ్యంలో సైబర్ నేరాలు కూడా రోజురోజుకూ పెరుగుతున్నాయని తెలిపారు. ఫిషింగ్ లింకులు, నకిలీ వెబ్సైట్లు, OTP మోసాలు, QR కోడ్ స్కామ్లు, సోషల్ మీడియా ద్వారా జరిగే మోసాలు, డిజిటల్ అరెస్ట్ పేరుతో భయపెట్టి డబ్బులు దోచుకునే కొత్త తరహా నేరాల గురించి విద్యార్థులకు వివరించారు.
అలాగే బలమైన పాస్వర్డ్లను ఉపయోగించడం, వ్యక్తిగత సమాచారం, బ్యాంకు వివరాలు, OTPలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులతో పంచుకోకూడదని సూచించారు. అపరిచితుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్, సందేశాలు, లింకులను నమ్మకుండా అప్రమత్తంగా ఉండాలని, సోషల్ మీడియాను బాధ్యతాయుతంగా వినియోగించాలని కోరారు.
ఏదైనా సైబర్ మోసానికి గురైన వెంటనే 1930 హెల్ప్లైన్కు ఫోన్ చేయాలని లేదా జాతీయ సైబర్ క్రైమ్ పోర్టల్లో ఫిర్యాదు నమోదు చేయాలని అధికారులు సూచించారు. ప్రతి నెల మొదటి బుధవారం నిర్వహించే సైబర్ జాగృతి దివస్ ద్వారా విద్యార్థులు, ఉపాధ్యాయులు, ప్రజల్లో సైబర్ భద్రతపై అవగాహన పెంపొందించడం ప్రధాన లక్ష్యమని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, పోలీసు సిబ్బంది, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.



