– ఫోన్ చేసినా స్పందన కరవు.. చిట్వేల్ విద్యుత్ సిబ్బందిపై ప్రజల అసంతృప్తి
– విద్యుత్ సరఫరా ఎప్పుడు వస్తుందో చెప్పే నాథుడే లేరంటున్న మండల ప్రజలు
చిట్వేల్: తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం చిట్వేల్ మండలంలో విద్యుత్ సరఫరా అంతరాయాలపై ప్రజలకు సరైన సమాచారం అందడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎప్పుడు విద్యుత్ నిలిచిపోయినా సరఫరా ఎప్పుడు పునరుద్ధరిస్తారో తెలుసుకునేందుకు సబ్స్టేషన్ సిబ్బందికి ఫోన్ చేస్తున్నా సరైన స్పందన ఉండడం లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అడిగితే ‘మెయిన్ సప్లై పోయింది.. వస్తుంది’ అనే సమాధానంతోనే సరిపెడుతున్నారని, విద్యుత్ ఎప్పుడు వస్తుందనే విషయంపై స్పష్టమైన సమాచారం ఇవ్వడం లేదని చెబుతున్నారు. దీంతో ఇళ్లలో చిన్నారులు, వృద్ధులు, వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ప్రజలు తెలిపారు. ప్రజలకు అత్యవసరమైన విద్యుత్ సరఫరాపై సిబ్బంది బాధ్యతగా వ్యవహరించి, ఫోన్ ద్వారా సరైన సమాచారం అందించాలని కోరుతున్నారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న సిబ్బందిపై ఉన్నతాధికారులు విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని చిట్వేల్ మండల ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.

