పున్నమి ప్రతినిధి,తిరుపతి, విద్య జూలై 30
శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం జీవరసాయన శాస్త్ర విభాగం, రాష్ట్రీయ ఉన్నత విద్యా అభియాన్ రెండవ దశ ఆధ్వర్యంలో ఏర్పాటైన మూలిక, కృత్రిమ ఔషధాల అభివృద్ధి కేంద్రం, హైదరాబాదు విశ్వవిద్యాలయంలోని ఆస్పైర్-బయోనెస్ట్ సంయుక్తంగా నిర్వహిస్తున్న “విశ్వవిద్యాలయాల్లో జీవశాస్త్రాల్లో ఆవిష్కరణలు, వ్యవస్థాపకత పర్యావరణ వ్యవస్థ నిర్మాణం” అనే అంశంపై ద్విదిన జాతీయ సదస్సు గురువారం ఎస్వీయూ సెనేట్ హాలులో ప్రారంభమైంది.
ప్రారంభోత్సవానికి విశ్వవిద్యాలయ రెక్టరు ఆచార్య చ. అప్పారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రిజిస్ట్రారు ఆచార్య ఎం. భూపతి నాయుడు, హైదరాబాదు విశ్వవిద్యాలయానికి చెందిన ఆచార్య యోగేశ్వరరావు, జీవరసాయన శాస్త్ర విభాగాధిపతి, సదస్సు అధ్యక్షులు ఆచార్య ఓ.వి.ఎస్. రెడ్డి, సదస్సు సమన్వయకర్త ఆచార్య ఎం. బాలాజీ పాల్గొన్నారు.
ఆచార్య యోగేశ్వరరావు “జ్ఞానాధారిత ఆర్థిక వ్యవస్థ రూపకల్పనలో కొత్త సంస్థల పాత్ర” అనే అంశంపై ప్రధాన ఉపన్యాసం చేశారు. కొత్త సంస్థల ప్రాథమిక సూత్రాలు, నిధుల సమకూర్పు సంస్థలు, అవకాశాలున్న ప్రత్యేక రంగాలు, ప్రపంచ, భారత ఆర్థిక వ్యవస్థల్లో కొత్త సంస్థల ప్రభావాన్ని వివరించారు. యువ పరిశోధకులు తమ ఆవిష్కరణలను పరిశ్రమలతో అనుసంధానం చేయాలని సూచించారు.బెంగళూరుకు చెందిన డాక్టరు చంద్రశేఖర్ నాయర్ “ఆవిష్కరణలను ప్రపంచ సంస్థగా విస్తరించడం” అనే అంశంపై మాట్లాడారు. పెద్ద సాంకేతిక సంస్థ నుంచి మాల్బయో రోగనిర్ధారణ సంస్థ వరకు తన పారిశ్రామిక ప్రయాణాన్ని వివరించారు. భారత ఆరోగ్య రంగంలో పరిశోధనలకు లభిస్తున్న నిధులు, ఆరోగ్య రంగ మార్కెట్ పరిమాణం, ఆవిష్కరణలను ప్రపంచ స్థాయి వ్యాపారాలుగా మార్చే అవకాశాల గురించి చెప్పారు.ఎక్సైటాన్ రోగనిర్ధారణ సంస్థకు చెందిన డాక్టరు బి.వి. రవికుమార్ “లక్ష్య ఉత్పత్తి ప్రణాళిక – ఆవిష్కర్తల మార్గం” అనే అంశంపై ప్రసంగించారు. పరిశోధనలను వినియోగదారులకు చేరే ఉత్పత్తులుగా మార్చే ప్రక్రియను వివరించారు.
హైదరాబాదు విశ్వవిద్యాలయం ఆస్పైర్-బయోనెస్ట్కు చెందిన ఆచార్య రాజగోపాల్ “విద్య నుంచి ఆవిష్కరణలు, కొత్త సంస్థల వరకు” అనే అంశంపై మాట్లాడుతూ, విద్యా వ్యవస్థలో ఆవిష్కరణల సంస్కృతిని పెంపొందించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు.సదస్సు సమన్వయకర్త ఆచార్య ఎం. బాలాజీ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ విశ్వవిద్యాలయాల పరిశోధక విద్యార్థులకు ఈ సదస్సు మార్గదర్శకంగా నిలుస్తుందన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్రీయ ఉన్నత విద్యా అభియాన్ రెండవ దశ సమన్వయకర్త డాక్టరు కె.వి. సుచరిత, ముఖ్య కార్యనిర్వహణాధికారి వంశీ కృష్ణ రాయలతో పాటు పలువురు ఆచార్యులు, విద్యార్థులు, పరిశోధకులు పాల్గొన్నారు.

