అనపర్తి, సెప్టెంబరు 6 (పున్నమి ప్రతినిధి): ఆంధ్రప్రదేశ్లో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు జనసేన పార్టీ సమాయత్తమవుతున్న నేపథ్యంలో రాజమహేంద్రవరం పార్లమెంట్ పరిధిలో పార్టీ సమన్వయ బాధ్యతలను అప్పగించింది. జనసేన పార్టీ నియమించిన స్థానిక సంస్థల ఎన్నికల సమన్వయ కమిటీలో రాజమహేంద్రవరం పార్లమెంట్ కో-ఆర్డినేటర్గా రావాడ నాగు, పార్లమెంట్ సపోర్టింగ్ సభ్యుడిగా ఇందల వీరబాబు నియమితులయ్యారు.
ఈ సందర్భంగా వారిని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఘనంగా సత్కరించి, శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ స్థానిక సంస్థల ఎన్నికల్లో సమన్వయంతో ముందుకు సాగాలని ఆయన ఆకాంక్షించారు.
కూటమి అభ్యర్థుల విజయానికి నాయకులు, కార్యకర్తలంతా సమష్టిగా కృషి చేయాలని ఎమ్మెల్యే నల్లమిల్లి సూచించారు. స్థానిక స్థాయిలో పార్టీ శ్రేణులను సమన్వయం చేస్తూ ఎన్నికల ప్రక్రియలో చురుకైన పాత్ర పోషించాలని కోరారు. కొత్తగా బాధ్యతలు చేపట్టిన రావాడ నాగు, ఇందల వీరబాబుకు నాయకులు, కార్యకర్తలు అభినందనలు తెలిపారు.


