ఖమ్మం నగరంలోని శ్రీనివాస్ నగర్ అయ్యప్ప గుడి ప్రాంతంలో ఇళ్ల తొలగింపు వ్యవహారం పేద కుటుంబాలను ఆందోళనకు గురిచేస్తోంది. 80 అడుగుల రోడ్డు కబ్జాకు గురైందంటూ కొందరు కోర్టును ఆశ్రయించగా, వారికి అనుకూలంగా తీర్పు రావడంతో 629 ఇళ్లను ఖాళీ చేయాలని అధికారులు నోటీసులు ఇచ్చినట్లు బాధితులు తెలిపారు. ప్రభుత్వం గతంలో జీవో 58 కింద ఇళ్ల పట్టాలు మంజూరు చేసి, విద్యుత్ మీటర్లు సైతం ఇచ్చిన తర్వాత ఇప్పుడు తమ ఇళ్లను కబ్జాలుగా పేర్కొనడం అన్యాయమని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏళ్లుగా నివాసం ఉంటున్న తమ కుటుంబాలను రోడ్డున పడేయకుండా ప్రభుత్వం ప్రత్యామ్నాయ పరిష్కారం చూపాలని కోరుతున్నారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించాలని బాధితులు డిమాండ్ చేశారు.



