వీరులపాడు మండలం, జమ్మవరం: గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తూ ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పిస్తోందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అన్నారు.
జమ్మవరం గ్రామంలో గండేపల్లి నుంచి రంగాపురం వరకు రూ.110 లక్షల అంచనా వ్యయంతో 4.200 కిలోమీటర్ల మేర అభివృద్ధి చేసిన నూతన బీటీ రోడ్డును కూటమి నేతలతో కలిసి ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ప్రారంభించారు. ఈ రహదారి ఆర్అండ్బీ శాఖ ఆధ్వర్యంలో అభివృద్ధి చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, గతంలో రహదారి అధ్వానంగా ఉండటంతో ప్రజలు, రైతులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు. గండేపల్లి–రంగాపురం రహదారి అభివృద్ధితో చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు ప్రయాణ సౌకర్యం మెరుగుపడటంతో పాటు వ్యవసాయ ఉత్పత్తుల రవాణాకు కూడా ఎంతో ప్రయోజనం కలుగుతుందన్నారు.
కూటమి ప్రభుత్వం కేవలం హామీలకే పరిమితం కాకుండా ప్రజలకు కనిపించేలా అభివృద్ధి పనులు చేపడుతోందని సౌమ్య పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో రాష్ట్రవ్యాప్తంగా మౌలిక వసతులను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు. నందిగామ నియోజకవర్గంలో రహదారులు, తాగునీరు, సాగునీరు, వైద్యం తదితర రంగాల్లో అభివృద్ధి పనులను వేగవంతం చేస్తున్నామని తెలిపారు.
ప్రజల అవసరాలకు అనుగుణంగా రహదారుల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తూ నందిగామ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య స్పష్టం చేశారు.
కార్యక్రమంలో కూటమి నేతలు, ఆర్అండ్బీ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు, కార్యకర్తలు పాల్గొన్నారు.



