*పున్నమి న్యూస్, నాయుడుపేట రూరల్:*
తిరుపతి జిల్లా నాయుడుపేట చెన్నై హైవేలో బుధవారం ఉదయం సుమారు 11 గంటల సమయంలో పెను ప్రమాదం తృటిలో తప్పింది.
చెన్నై వైపు లోడ్తో వెళుతున్న మహారాష్ట్రకు చెందిన లారీ అదుపుతప్పి హైవే పక్కన ఉన్న టిట్కో గృహాల వైపు దూసుకువచ్చింది. అదృష్టవశాత్తూ మధ్యలో కాలువ, చెట్టు ఉండడంతో లారీ కాలువలోకి దిగి చెట్టును ఢీకొని ఆగిపోయింది. దీంతో ఇళ్లకు ప్రమాదం తప్పింది.
అయితే ప్రమాదం జరిగిన తర్వాత స్థానికులు లారీ వద్దకు వెళ్లి చూడగా డ్రైవర్ కనిపించలేదు. లారీ పడిపోయే సమయంలో పక్కకు దూకేసి పారిపోయాడా అనే అనుమానంతో చుట్టుపక్కల ఎంత వెతికినా డ్రైవర్ జాడ కనిపించలేదని స్థానికులు తెలిపారు. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.
లారీ ఇక్కడి వరకు ఎలా వచ్చింది, ఎవరు తీసుకొచ్చారు అనే వివరాలు తెలియరాలేదు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.


