విశాఖపట్నం జిల్లా, (పున్నమి ప్రతినిధి) ఆగస్టు 11::
భీమిలి: భీమిలి పరిధిలోని జేవీ అగ్రహారం వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. బైక్ను ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో బైక్పై ప్రయాణిస్తున్న బీటెక్ విద్యార్థి గౌతమ్ (22) అక్కడికక్కడే మృతి చెందగా, అతనితో పాటు ప్రయాణిస్తున్న రవి కిరణ్ (22) తీవ్రంగా గాయపడ్డాడు.
మృతుడు గౌతమ్, గాయపడిన రవి కిరణ్ ఇద్దరూ రాజాం జీఎంఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ మూడో సంవత్సరం చదువుతున్న విద్యార్థులుగా తెలిసింది. భీమిలి సమీపంలోని ఓ కంపెనీలో ఇంటర్న్షిప్ పూర్తి చేసుకుని తిరిగి వెళ్తుండగా జేవీ అగ్రహారం వద్ద ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.
క్షణాల్లో ఆగిపోయిన ఆశల ప్రయాణం
ఉన్నత చదువులు చదివి మంచి భవిష్యత్తును నిర్మించుకోవాలని కలలు కంటున్న గౌతమ్ జీవితం రోడ్డు ప్రమాదంతో అర్ధాంతరంగా ముగిసింది. కుమారుడిపై ఎన్నో ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రులకు ఈ విషాద వార్త తీరని శోకాన్ని మిగిల్చింది. గౌతమ్ మృతితో కుటుంబ సభ్యులు, స్నేహితులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. తీవ్రంగా గాయపడిన రవి కిరణ్ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
యువ విద్యార్థి అకాల మరణంతో జేవీ అగ్రహారం పరిసరాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.


