పున్నమి న్యూస్ ప్రతినిధి:
వేముల, సెప్టెంబర్ 8: మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక సాధికారతను మరింత బలోపేతం చేసే దిశగా ₹20 లక్షల వరకు బ్యాంకు లింకేజీ రుణాలపై అన్ని రకాల సర్వీస్ ఛార్జీలను మినహాయించనున్నట్లు వెలుగు డీఆర్డీఏ అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్ ఆంజనేయులు తెలిపారు. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం 01-04-2026 నుంచి అమల్లోకి వచ్చినట్లు పేర్కొన్నారు.
ఈ మేరకు ఎస్బీఐ పులివెందుల టౌన్ బ్రాంచ్ మేనేజర్ విజయ్ కుమార్తో ఆంజనేయులు ప్రత్యేక సమావేశం నిర్వహించి డ్వాక్రా సంఘాల రుణాలపై సర్వీస్ ఛార్జీల మినహాయింపు అంశంపై చర్చించారు.
గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ 03-09-2026న జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం ప్రాసెసింగ్, డాక్యుమెంటేషన్, ఇన్స్పెక్షన్, లెడ్జర్ ఫోలియో తదితర సంబంధిత సర్వీస్ ఛార్జీలకు 100 శాతం మినహాయింపు ఉంటుందని తెలిపారు. ప్రతి సంఘానికి ₹20 లక్షల వరకు రుణంపై సర్వీస్ ఛార్జీల భారం ఉండదని, గరిష్టంగా సుమారు ₹33,500 వరకు ఆర్థిక ప్రయోజనం లభించే అవకాశం ఉందన్నారు.
01-04-2026 లేదా ఆ తర్వాత మంజూరైన రుణాలకు సర్వీస్ ఛార్జీలు వసూలు కాకుండా బ్యాంకులు చర్యలు తీసుకోవాలని కోరారు. గ్రామసమాఖ్య అసిస్టెంట్లు, సంఘం లీడర్లు రుణ ఖాతా స్టేట్మెంట్లు, పాస్బుక్లను పరిశీలించి సర్వీస్ ఛార్జీల పేరుతో ఏవైనా మొత్తాలు డెబిట్ అయ్యాయో లేదో నిర్ధారించుకోవాలని సూచించారు.
ఛార్జీలు వసూలైనట్లు గుర్తిస్తే వెంటనే సంబంధిత బ్యాంకు బ్రాంచ్ మేనేజర్ను సంప్రదించి, వసూలైన మొత్తాన్ని సంఘం ఖాతాలో తిరిగి జమ చేయించేలా రీఫండ్ చర్యలు చేపట్టాలని తెలిపారు. సంఘ సభ్యులు కూడా తమ రుణాలపై సర్వీస్ ఛార్జీలు వసూలు చేసినట్లయితే వెలుగు సిబ్బంది లేదా బ్యాంకు అధికారుల దృష్టికి తీసుకురావాలని ఆంజనేయులు సూచించారు.
ఈ సమావేశంలో కమ్యూనిటీ కోఆర్డినేటర్ హరికృష్ణ, ఫీల్డ్ ఆఫీసర్ వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.




