గోదావరి పుష్కరాలు – 2027 నేపథ్యంలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేసి సమగ్ర ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి సూచించారు.
మంగళవారం సాయంత్రం నగరపాలక సంస్థ కార్యాలయంలో పుష్కరాల నిర్వహణ, మౌలిక సదుపాయాలపై జాయింట్ కలెక్టర్ వై. మేఘా స్వరూప్, మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనా, అసిస్టెంట్ కలెక్టర్ క్షితిజ్ ఆదిత్య శర్మతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆర్ ఎమ్ సి పరిధిలో ఇతర శాఖల అధికారులతో విభాగాల వారీగా జరుగుతున్న ప్రాథమిక పనులు, అవసరమైన సౌకర్యాలు, ఘాట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రద్దీ నియంత్రణ, ట్రాఫిక్ మేనేజ్మెంట్, భద్రతా చర్యలు, నగర సుందరీకరణ, సిటీ మరియు ఘాట్లలో ఇల్యూమినేషన్, తాగునీరు, వసతి, పారిశుద్ధ్యం, స్మార్ట్ మరియు డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సోషల్ మరియు స్పోర్ట్స్ కార్యకలాపాలపై విస్తృతంగా చర్చించారు.
భక్తుల సౌకర్యార్థం విశ్రాంతి గదులు, సరైన రవాణా సదుపాయం, అన్నదాన వితరణ, దుస్తులు మార్చుకునే షెడ్లు, మొబైల్ టాయిలెట్లు వంటి అంశాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని కలెక్టర్ కీర్తి చేకూరి సూచించారు.
రాజమహేంద్రవరం, కొవ్వూరు, నిడదవోలు, మండపేట మునిసిపాలిటీల అధికారులు భక్తులకు అవసరమైన వసతి సదుపాయాల ఏర్పాటులో ఎలాంటి లోటు లేకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఇప్పటినుంచే ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు.
సుమారు 8 నుంచి 10 కోట్ల మంది భక్తులు పుష్కరాలకు హాజరయ్యే అవకాశం ఉన్నందున భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని తెలిపారు.
ముఖ్యంగా గర్భిణీలు, బాలింతలు పుణ్యస్నానాలు చేయడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉందన్నారు. పిండప్రదానాలు నిర్వహించే ఘాట్ల వద్ద పూజా సామాగ్రి విక్రయాలు ఘాట్ల వెలుపల మాత్రమే ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
నగరంలోని ఘాట్లను 6 కంపార్ట్మెంట్లుగా విభజించడం ద్వారా భక్తులు మరియు సిబ్బందికి సౌకర్యాలు మెరుగు పడతాయని అభిప్రాయ పడ్డారు. అన్ని విభాగాల అధికారులు బృందాలుగా ఏర్పడి నిరంతరం ఏర్పాట్లను పర్యవేక్షించాలని ఆదేశించారు. అలాగే 2015 పుష్కరాల సందర్భంగా పనిచేసిన అధికారుల అనుభవాలను పరిగణనలోకి తీసుకుని ప్రణాళికలను రూపొందించాలని సూచించారు.
ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ వై. మేఘా స్వరూప్, మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనా, అసిస్టెంట్ కలెక్టర్ క్షితిజ్ ఆదిత్య శర్మ , అదనపు కమిషనర్ పి.వి. రామలింగేశ్వర్, ఇతర మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.


