*గులాబీ జెండాను అడ్డుకోవాలనే కాంగ్రెస్ కుట్రలు సాగవు – మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్*
*ఖమ్మం ప్రజలు బీఆర్ఎస్ అభివృద్ధిని ఎప్పటికీ మరచిపోరు – పరిపాలనలో కాంగ్రెస్ వైఫల్యం*
జులై 26 ఖమ్మం జిల్లా పున్నమి ప్రతినిధి గుగులోత్ భావుసింగ్ నాయక్
ఖమ్మం: నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీని బలహీనపరిచే శక్తి ఎవరికీ లేదని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్పష్టం చేశారు. ఖమ్మం నగరంలోని 8వ డివిజన్లో నూతనంగా నిర్మించిన బీఆర్ఎస్ పార్టీ జెండా దిమ్మె వద్ద జెండాను ఆవిష్కరించిన అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
బీఆర్ఎస్ పార్టీ జెండా దిమ్మెలను తొలగించడం, గులాబీ జెండాను అడ్డుకోవడం ద్వారా పార్టీని నిలువరించాలనే కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు ఎప్పటికీ ఫలించవని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు అధికార అహంకారంతో ప్రగల్భాలు పలుకుతున్నారని ప్రజల గుండెల్లో బీఆర్ఎస్ పార్టీకి ఉన్న స్థానం ఎవరూ చెరపలేరని అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఉద్యమ పార్టీ బీఆర్ఎస్ అని, కోట్లాది మంది ప్రజల ఆశయాలు, త్యాగాల ప్రతీక అయిన గులాబీ జెండాను అని స్పష్టం చేశారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఖమ్మం నగరంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేశామని గుర్తు చేశారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, 24 గంటల ఉచిత నాణ్యమైన విద్యుత్ వంటి పథకాలతో ప్రజల జీవితాల్లో గుణాత్మక మార్పు తీసుకొచ్చామని పేర్కొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడుస్తున్నా ప్రజలకు చెప్పుకోదగ్గ ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా చేపట్టలేదని విమర్శించారు. కనీస పారిశుద్ధ్య నిర్వహణలో కూడా ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ఖమ్మం నగరంలో అనేక ప్రాంతాలు చెత్తకుప్పలుగా మారిపోయాయని ప్రజలకు ఇచ్చిన ఎన్నికల హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు.
బీఆర్ఎస్ పార్టీపై రాజకీయ కక్షతో జెండా దిమ్మెలను లక్ష్యంగా చేసుకోవడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని అన్నారు. ఇటువంటి బెదిరింపులకు, కుట్రలకు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఏమాత్రం భయపడరని, ప్రతి డివిజన్లో, ప్రతి గ్రామంలో గులాబీ జెండా మరింత ఎత్తుగా రెపరెపలాడుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఖమ్మం ప్రజలు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధిని ఎప్పటికీ మరచిపోరని, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలకు తగిన సమయంలో ప్రజలే గుణపాఠం చెబుతారని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు.



