విశాఖపట్నం (పున్నమి ప్రతినిధి):
విశాఖ రైల్వే స్టేషన్ ఎదురుగా ఫుట్పాత్పై నిద్రిస్తున్న నాలుగేళ్ల బాలిక శివపార్వతిని కిడ్నాప్ చేసిన కేసును టూ టౌన్ పోలీసులు గంటల వ్యవధిలోనే ఛేదించారు. సీసీ కెమెరాల ఫుటేజీ, సాంకేతిక ఆధారాలతో బాలిక ఆచూకీని గుర్తించి సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించారు. ఘటనకు సంబంధించి ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి, నేరానికి ఉపయోగించిన స్కూటీ, రెండు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
రాత్రి సమయంలో బస్స్టాప్ వద్ద నిద్రిస్తున్న బాలికను స్కూటీపై వచ్చిన నిందితులు తీసుకెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసిన వెంటనే విశాఖ నగర పోలీస్ కమిషనర్ ఆదేశాలు, డీసీపీ-1 సూచనల మేరకు ఏసీపీ లక్ష్మణమూర్తి పర్యవేక్షణలో సీఐ అప్పలనాయుడు ఆధ్వర్యంలో ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.
సీసీ కెమెరాలను జల్లెడ పట్టిన పోలీసులు సాంకేతిక ఆధారాలతో నిందితుల కదలికలను గుర్తించారు. విశాఖ నగర పోలీసులు, అనకాపల్లి జిల్లా పోలీసుల సమన్వయంతో చేపట్టిన గాలింపు చర్యలు ఫలించడంతో బాలికను సురక్షితంగా రక్షించారు.
దర్యాప్తులో బాలికను రూ.30 వేలకు అప్పగించేందుకు నిందితులు ఒప్పందం చేసుకున్నట్లు ఏసీపీ లక్ష్మణమూర్తి వెల్లడించారు. బాలికను త్వరగా గుర్తించి క్షేమంగా తమకు అప్పగించిన పోలీసులకు తండ్రి నయ్యద్ అబ్దుల్ హఫీజ్ కృతజ్ఞతలు తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించి కేసును వేగంగా ఛేదించిన టూ టౌన్ పోలీసులను అధికారులు అభినందించారు.
Uploaded Video:




